వైఎస్ ఫోటోపై జగన్ పార్టీ టార్గెట్ కెవిపి: వ్యూహాత్మకమా
వైయస్ ఫోటో లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెసు నేతలు జెసి దివాకర్ రెడ్డి, వి హనుమంత రావు, మధుయాష్కీ తదితరులు తీవ్రంగా మండిపడ్డారు. కెవిపిని జగన్ కోవర్టుగా అభివర్ణించారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లడం ఖాయమని విమర్శించారు. ఓ వైపు కాంగ్రెసు నేతలు కెవిపిపై ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్న సమయంలో జగన్ పార్టీ నేత కొండా సురేఖ కెవిపిపై రివర్స్ అటాక్ చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో గాంధీ భవనంలో పెట్టక పోవడంపై కెవిపి మాట్లాడటం తనకు కొంత బాధ, ఆశ్చర్యాన్నీ కలిగించిందని ఆమె గత శుక్రవారం అన్నారు. వైయస్ కుటుంబాన్ని వేధించినప్పుడు కెవిపి ఎందుకు స్పందించలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఒంటరిగా పోరాడుతుంటే కెవిపి ఏనాడు పలకరించలేదని విమర్శించారు. వైయస్ను అవినీతిపరుడు అని ఆరోపించినప్పుడు కూడా ఆయన నోరు మెదపలేదని, అప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ప్రశ్నించారు.
అంతకుముంచి జగన్ పార్టీ నేతలు కెవిపిని సమర్థించలేదు, విమర్శించలేదు. అయితే కెవిపిపై కాంగ్రెసు నేతలు దాడి చేస్తున్న నేపథ్యంలో జగన్ పార్టీ నేత సురేఖ వ్యూహాత్మకంగా ఆయనపై విమర్శలు చేసి ఉంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కెవిపిని కోవర్టుగా కాంగ్రెసు నేతలు అభివర్ణించిన సమయంలోనే ప్లాన్ ప్రకారం కెవిపిపై విమర్శలు చేశారని అంటున్నారు. గతంలోనూ సురేఖ కెవిపిపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయని, కొత్తగా ఏమీ లేదని మరికొందరు అంటున్నారు.