జానారెడ్డి వ్యాఖ్యల కలకలం, ఇస్తే సరి లేదంటే... కెసిఆర్
ఆయన వ్యాఖ్యలపై టిఎన్జీవో ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జానా రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ వ్యతిరేకి అంటూ మండిపడ్డారు. దీంతో జానా రెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. సమయం వృథా కావద్దనే ఉద్దేశ్యంతోనే తాను కేవలం స్వామి గౌడ్ గురించి మాట్లాడమని సూచించానని, అంతకుమించి ఏమీ లేదని చెప్పారు. అయినప్పటికీ ఉద్యోగులు తగ్గలేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు స్పందించి వారిని సముదాయించారు.
అనంతరం మాట్లాడిన ఎంపి పొన్నం ప్రభాకర్... తెలంగాణ ఇవ్వడం తప్ప కేంద్రానికి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ప్రకటించిన తెలంగాణను ఎలా సాధించుకోవాలో ఉద్యోగ సంఘాల నేతలు తమకు మార్గదర్శనం చేయాలని కోరారు. పార్లమెంటు సమావేశాలలో ఎలా నడుచుకోవాలో చెప్పాలని, 20వ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉద్యమాన్ని ఉధృతం చేస్తానంటున్నారని, తాము చేపట్టాల్సిన నిరసనపై ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టత ఇవ్వాలన్నారు.
ఈ నెల 6, 7వ తేదీలలో ఢిల్లీ పెద్దలను తెలంగాణ విషయమై కలుస్తామని చెప్పారు. ఉద్యోగ సంఘాలన్నీ కేసిఆర్ చేతుల్లో ఉన్నాయని అధిష్టానం భావిస్తోందని అన్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసుకు నష్టమేనని అన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ ఇస్తామని కేంద్రం చెబుతోందని, ఇస్తే సరి లేదంటే ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందన్నారు. తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు.
తెలంగాణపై తనకు సంకేతాలు ఉన్నాయని చెప్పారు. కొంతకాలం శాంతియుతంగా ఉంటే తెలంగాణ ఇవ్వడం సులభతరమవుతుందని చెప్పారని, అందుకే సైలెంట్గా ఉన్నట్లు చెప్పారు. ఇవ్వని పక్షంలో ఉద్యమం మరోమారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల వరకు వేచి చూస్తామని చెప్పారు. ఆరు నూరైనా తెలంగాణ సాధించి ఆచార్య జయశంకర్కు నివాళి అర్పిస్తామన్నారు. కెసిఆర్ జిల్లాలోని కంఠేశ్వర్లో జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.