2008లోనే నిర్ణయం, మాకు సంబంధం లేదు: జైపాల్
అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్ని మొన్నటిదాకా అమలు చేయలేదని, చివరికి... విద్యుత్ శాఖ తీవ్ర ఒత్తిడితో మంత్రుల బృందం నిర్ణయాన్ని అమలు చేయక తప్పలేదని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రానికి గ్యాస్ కోత విధించి, మహారాష్ట్రకు గ్యాస్ సరఫరా చేశారన్న వార్తలపై శనివారం 8 అంశాలతో స్పష్టమైన వివరణ ఇచ్చింది. నూతన సహజవాయు తవ్వకాల విధానం కింద ఉత్పత్తి అయిన గ్యాస్ను వాణిజ్యపరంగా ఉపయోగించడం, దాని ధర నిర్ణయంపై 2007లో సాధికారిక మంత్రుల బృందాన్ని (ఈజీవోఎం) ఏర్పరిచారని తెలిపింది.
అప్పట్లో దీనికి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షుడిగా ఉన్నారని, గ్యాస్ సరఫరాలో తొలి ప్రాధాన్యం ఎరువుల యూనిట్లకు, ఆ తర్వాత ఎల్పీజీ యూనిట్లకు, తర్వాత విద్యుత్ రంగానికి, చివరగా సీఎన్జీ రంగానికి (గృహ, రవాణా అవసరాల కోసం) ఇవ్వాలని 2008లో నిర్ణయించారని, రత్నగిరి పవర్ ప్లాంట్కు ఎరువుల ప్లాంట్లతో సమాన ప్రాధాన్యం ఇవ్వాలని 2008 అక్టోబర్ 23న జరిగిన ఈజీవోఎం సమావేశంలోనే తీర్మానించారని తెలిపింది.
కెజి-డి6 క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తి బాగా దెబ్బతిందని... ప్రాధాన్య క్రమంలో వెనక ఉన్న రంగాలకు కోత విధించక తప్పలేదని తెలిపింది. కెజి బేసిన్ డి6లో ఉత్పత్తి మరింత తగ్గింది. డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో గ్యాస్ పొందుతున్న అన్ని విద్యుత్ ప్లాంట్లకూ దామాషా ప్రకారం కోత విధించాల్సి వచ్చింది. ప్రస్తుతం బొగ్గు కొరత, జల విద్యుదుత్పత్తితోపాటు గ్యాస్ కోత కూడా ఎదురుకావడంతో... విద్యుత్తు రంగం పరిస్థితి పులిమీద పుట్రలా మారింది.
ఈ సమస్యను కేంద్ర విద్యుత్ శాఖ తీవ్రంగా పరిగణించింది. విద్యుదుత్పత్తి పెంపునకు పలు సూచనలు చేసింది. రత్నగిరి ప్లాంట్కు ఎరువులరంగంతో సమాన ప్రాధాన్యతనిస్తూ అప్పట్లో ఈజీవోఎం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని పట్టుపట్టింది. దీంతో ఆ ప్లాంట్ ప్రాధాన్యం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పెట్రోలియం శాఖ అమలు చేయాల్సి వచ్చింది. అంతే తప్ప... ఈ నిర్ణయంలో పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖకు ఏ పాత్ర లేదని గమనించాలని తెలిపింది.
2008లోనే తీసుకున్న నిర్ణయాన్ని విద్యుత్ శాఖ ఒత్తిడి మేరకు, అమలు చేయడం మినహా మరో గత్యంతరం లేకపోయిందని, పెట్రోలియం మంత్రిత్వ శాఖ తనంతట తాను నిర్ణయాలు తీసుకోలేదని, ఈజీవోఎం నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉందని వివరించింది. 2008లో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని ఈజీవోఎం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించినా, మార్చినా... ఇప్పుడు రక్షణ మంత్రి ఆంటోనీ ఆధ్వర్యంలో ఏర్పరచిన ఈజీవోఎంకు మాత్రమే సాధ్యమని తెలిపింది. విద్యుత్ లోటును ఎదుర్కోవడానికి రీగ్యాసిఫైడ్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ను కొనుగోలు చేయడం తప్పదని పెట్రోలియం శాఖ వర్గాలు చెప్పాయి. ఈ మేరకు ఆ శాఖ ఎపి ట్రాన్స్కోకు ఆర్ఎల్ఎన్జీ కేటాయించేందుకు అంగీకరించింది.