కిరణ్కు ఊరట: ఎపికి రత్నగిరి గ్యాస్కు పిఎం ఆర్డర్స్
ప్రధాని ఆదేశాలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికే కాకుండా రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు, కేంద్ర పెట్రోలియం మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి కూడా ఊరట లభించింది. గ్యాస్ మళ్లింపుపై ప్రతిపక్షాల కేంద్ర ప్రభుత్వంపైనే కాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, జైపాల్ రెడ్డిపై, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ప్రతిపక్షాల ఒత్తిడి, అధికార పక్షంలోని ఓ వర్గం వ్యాఖ్యలతో తీవ్రమైన ఒత్తిడికి గురైన ముఖ్యమంత్రి గ్యాస్ మళ్లింపుపై సోమవారం విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి వీరప్ప మొయిలీతో చర్చించారు. ఆ తర్వాత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కలిశారు. కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తికి ప్రధాని కార్యాలయం నుంచి వెంటనే సానుకూల స్పందన రావడమే కాకుండా ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.
మహారాష్ట్రకు చెందిన సుశీల్ కుమార్ షిండే కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు దక్కాల్సిన గ్యాస్ను తన రాష్ట్రానికి చెందిన రత్నగిరి ప్లాంట్కు కేటాయించారనే ఆరోపణలు వచ్చాయి. కేంద్ర మంత్రుల సాధికార కమిటీ నిర్ణయం మేరకే ఆ విధంగా జరిగిందని, తన ప్రమేయం ఇందులో ఏమీ లేదని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చెప్పినా ప్రతిపక్షాలు ఆయనను వదిలిపెట్టలేదు. ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశాయి.
గ్యాస్ కేటాయింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటామని, రాష్ట్ర నేతగా తన వంతు కృషి చేస్తానని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్రెడ్డి ప్రధాని నిర్ణయం వెలువడడానికి ముందు అన్నారు. అదనపు విద్యుత్ను రాష్ట్రానికి ఇవ్వడమా, లేక గ్యాస్ కోతను పునరుద్ధరించడమా అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని జైపాల్రెడ్డి తెలిపారు.