సైనానెహ్వాల్కు అధికారిక స్వాగతం: తప్పిన ప్రమాదం
యాధృచ్ఛికంగా అయినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ వస్తున్న విమానంలోనే హైదరాబాదుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సైనాకు కిరణ్ అభినందనలు తెలిపారు. అంతకుముందు లండన్ నుండి బయలుదేరిన సైనా ఈ ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆమెకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
అటు నుండి ఆమె 12 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ఢిల్లీ - హైదరాబాద్ ప్లైట్లో నగరానికి బయలుదేరారు. హైదరాబాద్ వచ్చిన సైనాను శావ్ అధికారులు, అభిమానులు శంషాబాద్ నుండి గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీ వరకు ఘనంగా ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. అకాడమీకి వెళుతున్న సమయంలో సైనాకు ప్రమాదం తప్పింది. ఆమె వెళుతున్న వాహనం టైర్ పగిలింది. వాహనం మెల్లగా వెళ్లడంతో ఏమీ కాలేదు. మరో వాహనంలో ఆమెను అకాడమీకి తీసుకు వెళ్లారు. కాగా సైనా నెహ్వాల్ లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే.