ఫీజులపై రోడ్డుపై బైఠాయింపు: చంద్రబాబు అరెస్టు
ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, అవినీతిని అరికడితే ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వవచ్చునని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఖరి వల్ల 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆయన అన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా ఫీజు రీయంబర్స్మెంట్ ఇప్పిస్తామని ఆయన చెప్పారు. ఫీజులపై ప్రభుత్వాన్ని వదిలేది లేదని ఆయన అన్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్లో గల కెబిఆర్ పార్కు వద్ద రోడ్డుపై చంద్రబాబు బైఠాయించారు. దాంతో పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారు.
ఫీజు రీయింబర్స్మెంటుపై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ బుధవారంనాడు సచివాలయంలో సమావేశమైంది. ఈ స్థితిలో తెలంగాణ విద్యార్తి పరిషత్కు చెందిన విద్యార్థులు సందర్శకుల రూపంలో సచివాలయంలోకి చొచ్చుకు వచ్చి పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. ఈ సంఘటనతో సచివాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇంత మంది విద్యార్థులు ఒక్కసారిగా సచివాలయంలోకి చొచ్చుకురావడం ఎలా సాధ్యమైందని మంత్రులు కూడా దిగ్భ్రాంతి చెందారు. లోపలకు వచ్చి నినాదాలు ఇస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
విద్యార్థులకు ఫీజులు రీయింబర్స్మెంట్ చేసే విషయంలో కొన్ని షరతులను విధిస్తూ మంత్రులతో కూడిన కమిటీ చేసిన సిఫార్సులు ఇప్పటికే వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. ఎస్.సి, ఎస్.టి.లకు పూర్తి ఫీజును చెల్లిస్తూ, బిసి విద్యార్థులకు మాత్రం మొండిచెయ్యి చూపించే పద్ధతికి ఈ కొత్త విధానం శ్రీకారం చుడుతుందని విమర్శలు వస్తున్నాయి.
ఆఖరికి తెలుగుదేశం పార్టీ కూడా బి.సి.లకు 100 సీట్లు ఇస్తామంటూ ఆశలు రేకెత్తిస్తుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ విధానాలను బి.సి.లను దూరం చేసుకునే విధంగా ఉండడం బాధాకరమని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు కూడా విమర్శించారు. సొంత పార్టీ నాయకులనుంచే విమర్శలు రావడంతో కేబినెట్ సబ్ కమిటీ బుధవారంనాడు మళ్లీ సమావేశమైంది. ఈ సమావేశం ప్రారంభం కావడానికి ముందే తెలంగాణ విద్యార్థి పరిషత్కు చెందిన విద్యార్ధులు సచివాలయంలోకి దూసుకురావ డం సచివాలయంలో భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నది.