ఎమ్మెల్యే శ్రీరాములుకు ఎసిబి నోటీసులు, అరెస్టవుతారా
ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టైన గాలి జనార్ధన్ రెడ్డికి శ్రీరాములు ప్రధాన అనుచరుడు. జైలులో ఉన్న గాలిని శ్రీరాములు పలుమార్లు కలిశారు. గాలి బెయిల్ కోసం రూ.15 కోట్లు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. డీల్ కోసం రూ.100 కోట్లు కూడా ఇచ్చేందుకు గాలి సిద్ధపడ్డారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జైలులో ఉన్నప్పుడు గాలి తనకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ఈ డీల్ కుదిర్చారని ఎసిబి అధికారులు భావిస్తున్నారు.
శ్రీరాములు గాలిని పలుమార్లు జైలులో కలిసిన నేపథ్యంలో డీల్లో ఆయన పాత్ర కూడా ఏమైనా ఉందా అనే కోణంలో విచారించనున్నారు. గాలి బెయిల్ వ్యవహారంలో ఇప్పటికే పలువురు అరెస్టయ్యారు. కంప్లి ఎమ్మెల్యే సురేష్, గాలి సోదరుడు సోమశేఖర రెడ్డిలు ఇప్పటికే అరెస్టయ్యారు. తాజాగా ఎసిబి శ్రీరాములును విచారణకు పిలిచింది. విచారణకు పిలిపించి పలువురిని అరెస్టు చేసిన నేపథ్యంలో శ్రీరాములు అరెస్టు కూడా జరుగుతుందా అనే ఆందోళన గాలి వర్గంలో కనిపిస్తోంది.