ఎయిర్ హోస్టెస్ గీతిక ఆత్మహత్య: పరారీలో మాజీమంత్రి
అరుణ చద్దాను తాము అరెస్టు చేశామని, కందా మాత్రం పారిపోయారని చెప్పారు. తాము కందా కోసం గాలిస్తున్నామని చెప్పారు. అయితే కందా అదృశ్యం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అరుణ చద్దాను పలుమార్లు విచారించిన అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తమ ఎదుట హాజరవ్వాలని కందాకు కూడా పోలీసులు నోటీసులు పంపించారు. నోటీసులు పంపించి మూడు రోజులు అయినా కందా నుండి ఎలాంటి స్పందన లేదు. అతను విచారణకు హాజరు కావడం లేదు.
కాగా మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందాను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గీతికా శర్మ ఆత్మహత్య కేసులో తమ ఎదుట హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు గోపాల్ కందాకు మంగళవారం నోటీసులు పంపించారు. అతను ఏ క్షణమైనా పోలీసు హెడ్ క్వార్టర్లో విచారణకు హాజరయ్యే అవకాశముందని వార్తలు వచ్చాయి. ఈ కేసులో కందాతో పాటు అరుణ చద్దాను కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. కానీ ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు.
అరుణ చద్దా.. కందా యొక్క డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఎండిఎల్ఆర్లో ఉద్యోగి. ఇప్పటికే పోలీసులు మంగళవారం ఉదయం చద్దాతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులను ప్రశ్నించారు. కందాను కూడా గీతిక ఫోన్లో దొరికిన కాల్ డిటెల్స్ను బట్టి ప్రశ్నించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయంలో కందా పైన పోలీసులు తాజాగా ఛార్జీషీట్ కూడా దాఖలు చేశారు.
గీతికా శర్మ ఆత్మహత్యతో హర్యానా హోంశాఖ సహాయ మంత్రి గోపాల్ కందా ఆదివారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆయన నిర్వహించిన విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టెస్గా పని చేసిన ఇరవై మూడేళ్ల గీతికా శర్మ శనివారం రాత్రి ఢిల్లీలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గోపాల్ మానసిక వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె లేఖ రాసింది.