ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చంద్రబాబు మద్దతు

తాజా రిజర్వేషన్లతో ఎస్సీల్లోని అన్ని వర్గాలకు సమ న్యాయం జరగడం లేదని, సమన్యాయం జరగాలంటే వర్గీకరణ అవసరమని, వర్గీకరణ కోసం చాలా కాలంగా ఆందోళనలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. జానాభా ప్రాతిపదికపై ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సిందేనని ఆయన అన్నారు. గతం నుంచి కూడా తాము వర్గీకరణకు మద్దతు ఇస్తున్నామని, మరోసారి చర్చించి ఆ వైఖరిని కొనసాగించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.
సామాజిక న్యాయానికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని పలు కమిటీలు అభిప్రాయపడ్డాయని, అందుకు శాసనసభ కూడా నాలుగు సార్లు తీర్మానం చేసిందని ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు తాను మరోసారి కేంద్రానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. తాము వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, ఇతర పార్టీల గురించి తామేమి చెప్పలేమని ఆయన అన్నారు.
ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారనేది ప్రజలు గమనిస్తున్నారని, తమకు మాత్రం వర్గీకరణ న్యాయంగా తోచిందని, అయితే ఏమైనా సలహాలు వస్తే తీసుకుంటామని ఆయన చెప్పారు. వేరే రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలియదు గానీ మన రాష్ట్రంలో మాత్రం వర్గీకరణ జరగాలని కమిటీలు నివేదికలు ఇచ్చాయని ఆయన అన్నారు. వర్గీకరణపై మిగతా పార్టీలు వాటి వైఖరిని చెప్పుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
సామాజిక కార్యకర్త అన్నా హజారేకు దేశం నీరాజనం పట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో కుంభకోణాలు పెరిగాయని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్, తదితర కుంభకోణాలను ఆయన ప్రస్తావించారు. దేశంలో అవినీతి పెచ్చరిల్లిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications