'ఆ లేడీ లాయర్ త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంది'

ఐఎఎస్ అధికారి కూతురు, మహిళా న్యాయవాది పల్లవి పుర్కాయస్తను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. పాతికేళ్ల పల్లవని అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డు సజ్జాద్ పఠాన్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొదటి ఓ గట్టి వస్తువుతో కొట్టి, ఆ తర్వాత కత్తితో మెడ కోసి పల్లవిని అతను హత్య చేశాడు. నేరాన్ని అతను అంగీకరించాడు.
పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పఠాన్ను పోలీసులు ముంబై రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం తనను తిట్టినందుకే పల్లవిని తాను హత్య చేశానని అతను పోలీసులకు చెప్పాడు. ఒంటరిగా ఉందని తెలిసే తాను ఆమెపై దాడికి దిగాలని నిర్ణయించుకున్నట్లు అతను చెప్పాడు. గురువారం తెల్లవారు జామున పోలీసులు పల్లవి హత్యకు గురైన విషయాన్ని గుర్తించారు.
పోలీసులు పల్లవితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పల్లవి ముంబైలో గల 20 అంతస్థుల హిమాలయన్ అపార్టుమెంటులోని 16వ అంతస్థులో తనతో సహజీవనం చేస్తున్న అవిక్ సేన్గుప్తాతో కలిసి ఉంటోంది. పల్లవిపై అత్యాచారం చేయడానికి కూడా పఠాన్ ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఓ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలో పనిచేస్తున్న అవిక్ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె హత్యకు గురైన విషయం తెలిసింది.
పల్లవి ఓ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి న్యాయ వ్యవహారాల మేనేజర్గా పనిచేస్తోంది. పల్లవి అపార్టుమెంటులో అకస్మాత్తుగా కరెంట్ పోయింది. దీంతో అవిక్కి సమాచారం అందించింది. అతని సలహాతో వాచ్మన్ ద్వారా ఎలక్ట్రీసియన్ను పిలిపించి మరమ్మతు చేయించింది. ఎలక్ట్రీషియన్లు వెళ్లిపోయిన తర్వాత వాచ్మన్ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పల్లవి ఓ ఐఎఎస్ అధికారి కూతురు కూడా. ఆయన ఢిల్లీలోని ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications