తెలంగాణ ఇష్యూ: సీమాంధ్ర ఎంపిలకు కావూరి విందు
ఇటీవలి యుపిఎ సమన్వయ కమిటీ సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చలు జరిగినట్లు తెలియడం కూడా కావూరి విందు సమావేశానికి ఒక కారణంగా భావిస్తున్నారు. అయితే, తెలంగాణ అంశంపై ఢిల్లీ కాంగ్రెసులో పెద్దగా చర్చ జరగలేదు. అయినా కావూరి సాంబశివ రావు ఈ విందు సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారనేది ప్రశ్నార్థంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర నాయకులకు కావూరి సాంబశివ రావు మొదటి నుంచీ నాయకత్వం వహిస్తున్నారు.
తెలంగాణ అంశాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చాలని సీమాంధ్ర నాయకులు కూడా తమ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. దాన్ని నాన్చడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని వారంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నప్పటికీ సమస్యకు పరిష్కారం సాధ్యమైనంత త్వరగా తేల్చాలని వారు అంటున్నారు. ఇరు ప్రాంతాల నాయకులు తమ తమ వైఖరులకు కట్టుబడి ఉండడం వల్ల ఏం చేయాలో అధిష్టానానికి అంతు పట్టడం లేదు.
తెలంగాణకు పరిష్కార మార్గాలు ఎలా ఉండాలనే అంశంపై కాంగ్రెసు అధిష్టానం ఏమైనా కావూరి సాంబశివ రావుకు సూచించిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. సీమాంధ్ర నాయకుల తరఫు నుంచి ఒక స్పష్టమైన ప్రతిపాదన ఏదైనా అధిష్టానం ముందు పెట్టే ఆలోచనలో ఉందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇందు కోసమే కావూరి సాంబశివ రావు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు విందు ఏర్పాటు చేసి ఉండవచ్చుననే ప్రచారం సాగుతోంది.