విజయమ్మ ఫీజు పోరు దీక్ష ప్రారంభం, నాని హాజరు
కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్కు గురై వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్ విషయం తెలిసిందే. అలాగే, విజయనగరం జిల్లా కాంగ్రెసు శాసనసభ్యుడు సుజయ రంగారావు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వచ్చారు. వీరిద్దరు కూడా తమ శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అయితే, వారి రాజీనామాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇంకా ఆమోదించలేదు.
దీక్షా శిబిరంలో కొడాలి నాని ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబకు దిక్కు లేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయాలని కోరడం తప్ప మరో గత్యంతరం లేదని ఆయన అన్నారు. పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు వైయస్ రాజశేఖర రెడ్డి కల, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాడుతుందని వైయస్సార్ కాంగ్రెసు అధికార ప్రతినిధి వాసి రెడ్డి పద్మ అన్నారు. ఈ జన ప్రవాహం ప్రభుత్వం మెడలు వంచాలని ఆమె అన్నారు.
వైయస్ మరణించిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఎత్తేయాలని ప్రభుత్వం చూస్తోందని సుజయ కష్ణ రంగారావు అన్నారు. ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు రోజా తీవ్రంగా ధ్వజమెత్తారు. కాలేజీ యాజమాన్యాలను ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోందని రోజా విమర్శించారు. డబ్బు లేదని ప్రభుత్వం కుంటిసాకు చెబుతూ ఫీజు రీయంబర్స్మెంట్ పథకానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వంగవీటి రాధ, వైవి సుబ్బా రెడ్డి, శోభా నాగిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తదితరులు ఈ దీక్షకు హాజరయ్యారు.