విమానాల హైజాక్కు టెర్రరిస్టుల కుట్ర, హై అలర్ట్?
అయితే, ఈ సమాచారాన్ని ద్రువీకరించే ఆధారాలు మాత్రం లభించలేదు. ఇటీవల హింస ప్రజ్వరిల్లిన అసోం నుంచే ఈ సమాచారం వస్తోందని, అయితే, అది రూఢీ కాలేదని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. గతంలో అయితే, తమకు వచ్చిన సమాచారం రూఢీ అయిన తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో రాష్ట్రాలకు సమాచారం అందించేది. కానీ, ఈసారి అవకాశం తీసుకోరాదని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ముందు జాగ్రత్త తీసుకునేందుకు వీలుగా, వచ్చిన సమాచారాన్ని రాష్ట్రాలకు, ఇతర భద్రతా సంస్థలకు వెంటనే చేరవేయాలని ఇంటెలిజెన్స్ బ్యూరోను ఆదేశించింది.
విమానం హైజాక్ సమాచారం కూడా అసోం నుంచి వచ్చిందే. అయితే, ఉత్తరాదిలో లష్కరే తాయిబా ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేయనున్నారన్నది దాని సారాంశం. అంతకుమించి వివరాల్లేవు. జమ్మూ కాశ్మీరు పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరోతో సంప్రదింపులు జరిపిన తర్వాత హైజాక్ సమాచారంతో పెద్దగా ముప్పు లేదని నిర్థారణకు వచ్చారు. అయినా, ఇప్పటికీ ఉగ్ర సమాచారం వస్తూనే ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలంటూ పశ్చిమ కోస్తా రాష్ట్రానికి కేంద్ర భద్రతా సంస్థలు సూచించాయి.
ఇక, ముంబై పోలీసుల కస్టడీలో ఉన్న లష్కరే ఉగ్రవాది అబు జుందాల్ సంచలన వివరాలను బయటపెట్టాడు. రాబోయే కొన్నేళ్లలో భారతదేశవ్యాప్తంగా పదిచోట్ల ఉగ్రవాద దాడులు చేయాలని లష్కరే తాయిబా పథకం పన్నిందని, వాటన్నిటిలోనూ పాల్గొంటానని తాను అంగీకరించానని వెల్లడించాడు. అయితే, ఉగ్రవాద దాడులు ఎక్కడెక్కడ జరపనున్నారన్న విషయం తనకు తెలియదని చెప్పాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
తాను లష్కరే ఉగ్రవాదినని, దాడుల్లో క్రియాశీలంగా పాల్గొంటానని జుందాల్ అంగీకరించాడని చెప్పారు. ముంబై ముట్టడికి సంబంధించి అబు జుందాల్ ఇచ్చిన సమాచారం మేరకు అతని సన్నిహితుడు అబ్దుల్ రఫెను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల కిందట అదుపులోకి తీసుకున్న రఫెను ముంబై ముట్టడికి సంబంధించి విచారణ జరుపుతున్నారు.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో పోలీసులు అణువణువు గాలిస్తున్నారు. కాగా, జాతీయ పండుగలు, ప్రముఖుల పర్యటనల సందర్భంగా నిర్ధారణ కాకపోయినా వచ్చిన సమాచారాన్ని వచ్చినట్లు రాష్ట్రాలకు చేరవేస్తారని, ఇది సాధారణమేనని ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఏకే దోవల్ తెలిపారు.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ముందు జాగ్రత చర్యల్లో భాగంగా సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, జీఎంఆర్ రక్షణ సిబ్బంది అణువణువు తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చినవారిని విచారిస్తున్నారు. కాగా, విమానాల హైజాక్కు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
అన్ని విమానాశ్రయాలవద్ద హై అలర్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా రేణిగుంట విమానాశ్రయంలోనూ పటిష్ఠ నిఘా చేపట్టారు. విమానాశ్రయం వద్ద ప్రత్యేక బలగాలను నియమించారు. విమానాశ్రయం, టెర్మినల్ భవనం, టవర్, లాంజ్ల వద్ద బందోబస్తు పెంచారు. విమానాశ్రయం చుట్టూ తనిఖీ నిర్వహిస్తున్నారు.