ధర్మానకు పరామర్శలు: కిరణ్ రెడ్డితో మంత్రుల భేటీ
వారు ధర్మాన ప్రసాదరావుతో సమావేశమై రాజీనామా చేసిన తర్వాతి పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఎన్ రఘువీరా రెడ్డి, పితాని సత్యనారాయణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై వారు ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు తెలుస్తోంది.
సిబిఐ చార్జిషీటును పరిశీలించాకే ధర్మాన రాజీనామాపై నిర్ణయం తీసుకుంటామని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాజీవితంలో ఆరోపణలు సహజమే అని, ధర్మాన రాజీనామాతో నష్టమేమీ లేదన్నారు. ధర్మానకు ప్రభుత్వం, పార్టీ సాయంగా ఉంటుందని బొత్స సత్యనారాయణ చెప్పారు.
బుధవారం కూడా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు మంత్రులు ధర్మాన ప్రసాద రావును కలిశారు. ఒక్కరొక్కరే ధర్మాన ప్రసాద రావు ఇంటికి వచ్చి పలకరించి పోతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో వాన్పిక్పై సిబిఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో ధర్మాన ప్రసాద రావును నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ముఖ్యమంత్రికి తన రాజీనామా లేఖను సమర్పించారు.