ఎయిర్ హోస్టెస్ సూసైడ్: పరారీలో మంత్రి, ట్విస్ట్ డైవర్టా?
పోలీసులు, రాజకీయ నేతల అండదండలతోనే అతను తప్పించుకొని తిరుగుతుండవచ్చునని అనుమానిస్తున్నారు. ఆగస్టు 8వ తేదిన కందాకు పోలీసులు తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు కందా పోలీసులకు చిక్కలేదు. బుధవారం రోజు పోలీసులు మాట్లాడుతూ... తాము సుమారు 50 ప్రాంతాలలో రైడ్ చేశామని, 25 మందికి పైగా విచారించామని కానీ కందా మాత్రం ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని చెప్పారు.
ముందస్తు బెయిల్ కోసం ఇటీవల కందా లాయర్ వేసిన పిటిషన్ను కోర్టు తోసి పుచ్చింది. తన పిటిషన్లో కందా.. పోలీసుల ఎఫ్ఐఆర్లో ఏం లేదని, ఆత్మహత్య చేసుకున్న గీతిక శర్మ సెన్సిటివ్ అని, తాను ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించలేదని తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు మాత్రం ఆయన పిటిషన్ను తోసి పుచ్చింది. పోలీసులు మాత్రం ఈ కేసును చేధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.
విచారణ సమయంలో పోలీసులు పలు విషయాలు గుర్తించారు. గీతిక ఎండిఎల్ఆర్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో తన పని పూర్తయిన తర్వాత కందాను కలిసి పూర్తి రిపోర్ట్ ఇచ్చేదని విచారణ అధికారులు గుర్తించారు. అలాగే కొన్ని షాకింగ్ విషయాలు కూడా వారి దృష్టికి వచ్చాయి. ఈ కేసులో అరెస్టైన అరుణ చద్దా.. గీతికకు అబార్షన్ అయిందని చెప్పి కొత్త ట్విస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గీతిక కుటుంబ సభ్యులు మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు.
దర్యాఫ్తును పక్కదోవ పట్టించి కేసును నీరుగార్చేందుకే అరుణ చద్దా గీతికకు అబార్షన్ అయిందని చెబుతుండవచ్చునని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గీతిక ఈ నెల 5వ తేదిన కందా, చద్దా తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. గీతికతో మాట్లాడేందుకు కందా ఉపయోగించిన సిమ్ కార్డ్స్ తన కంపెనీలో పని చేస్తున్న ఇతర ఉద్యోగి పేరు మీద తీసుకున్నవని తెలుస్తోంది. సిమ్ కార్డు ఎవరి పేరు మీద ఉందో ఆ ఉద్యోగిని కూడా అరెస్టు చేశారు.
మరోవైపు కందాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఇరవై నాలుగు గంటలలోగా ఈ వారెంట్ అమలు అయ్యేలా చూడాలని కోర్టు ఆదేశించింది.