ఢిల్లీ వెళ్లే యోచనలో ధర్మాన: అధిష్టానానికి వివరణ
కాగా.. సీబీఐ విచారణ వరకు వస్తే, దాన్ని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ధర్మాన తన ఏర్పాట్లు తాను చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని బట్టి స్క్వాష్ పిటిషన్ వేయడమా, మరో విధంగా వెళ్లడమా అని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం నుంచి న్యాయసహాయం పొందే అవకాశం ఉందా అన్న అంశాన్ని కూడా ధర్మాన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే, రాయపాటి సాంబశివరావు, మంత్రులు కాసు కృష్ణారెడ్డి, గంటా శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు ఆదివారం ధర్మానను ఆయన నివాసంలో కలిశారు. ధర్మాన ప్రసాద రావుకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సహా పలువురు మంత్రులు మద్దతు ఇస్తుండగా, తెలంగాణకు చెందిన వి. హనుమంతరావు వంటి సీనియర్ నాయకులు ఆయన రాజీనామాను ఆమోదించాలని అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం పెద్దల సలహాను బట్టి ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ధర్మాన ప్రసాద రావు ఉన్నట్లు తెలుస్తోంది.