తెలంగాణపై చంద్రబాబు: దళారిని కాదన్న నారాయణ
ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర తెలంగాణ జిల్లాల్లో సాగుతుందని వరంగల్లో ముగింపు సభ ఉంటుందని తెలిపారు. ఉద్యమంలో భారతీయ జనతా పార్టీతో వేదిక పంచుకోబోమన్నారు. ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని, కాగ్ నివేదిక భగవద్గీత కాదన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అవినీతి మంత్రులను కాపాడే యత్నం సిఎం చేస్తున్నారన్నారు. సిఎం స్వామి భక్తి ప్రదర్శించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
మంత్రి ధర్మాన ప్రసాద రాజీనామాను ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. రుయా ఆసుపత్రి మరణాలు అన్నీ ప్రభుత్వం హత్యలే అన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని, మంత్రి కొండ్రు మురళీ మోహన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బిసిలు రాజ్యాంగ హక్కుల కోసం పోరాడాలని సూచించారు.
రుయాను సందర్శించిన బాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం తిరుపతిలోని రుయా ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. వైద్యులు, సర్కారు నిర్లక్ష్యం వల్లనే శిశు మరణాలు జరుగుతున్నాయన్నారు. రుయాలో కనీస సౌకర్యాలు లేవన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని, జీతాలు లేక సిబ్బంది ఉద్యోగం మానేస్తున్నారన్నారు. రుయాను 300 పడకల ఆసుపత్రిగా నిర్మిస్తే 90 పడకలు మాత్రమే ఉన్నాయని, అందుకు సరిపడా సిబ్బంది కూడా లేదన్నారు.
ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. రుయా పరిస్థితి దారుణంగా ఉందని, తాగటానికి నీళ్లు కూడా లేవన్నారు. పిల్లల జీవితాలంటే ప్రభుత్వానికి లెక్కలేదని, రాష్ట్రంలో డెంగ్యూ ఫీవర్ లేదని ప్రభుత్వం చెబుతోందని, కానీ రుయాలోనే 30 మంది ఆ రోగంతో బాధపడుతున్నారన్నారు. ఎంపి చింతా మోహన్ చోద్యం చూస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. రుయాలోని తన నివాసాన్ని చింతా ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు.
రుయాలో ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి సందర్శించలేదన్నారు. ఇక్కడకు వస్తే వారికి పేషెంట్ల మనోవేధన అర్థమవుతుందన్నారు. రుయాలో వెంటనే మంచి నీటి సౌకర్యం కల్పించాలని, ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలని, సరిపడా సిబ్బందిని నియమించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రుయా ఘటనపై హెచ్చార్సీకి ఫిర్యాదు చేస్తానన్నారు. రేపటి నుండి రుయా వద్ద టిడిపి ఆందోళన చేపడుతుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు కొనసాగుతుందన్నారు.