టిడిపి అఫైర్స్: బాలకృష్ణ ముందుకు, హరికృష్ణ వెనక్కి
బావ, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై అసంతృప్తితో హరికృష్ణ వెనక్కి తగ్గారు. చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్కు పార్టీ పగ్గాలు అందించాలనే ప్రయత్నాల్లో ఉన్నారనే అసంతృప్తితో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దాంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీతో లేరనే ప్రచారం ప్రారంభమయ్యే ప్రమాదం ఏర్పడింది.
ఈ స్థితిలో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో ప్రధాన బాధ్యతలు చేపట్టడానికి ముందుకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడేనని చెప్పి నాయకత్వ వివాదానికి తెర దించారు. తాను శాసనసభకు పోటీ చేస్తానని కూడా చెప్పారు. దీంతో హరికృష్ణ కాకుండా బాలకృష్ణ ప్రధానమైన నాయకుడిగా మారారు. పార్టీ నాయకులు కూడా ఈ పరిణామంతో సంతోషంగా ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
పార్టీలో ఇప్పుడు చిచ్చు పెట్టడం సరి కాదనే అభిప్రాయంతో బాలకృష్ణ ఉన్నట్లు చెబుతున్నారు. పైగా, నారా లోకేష్ ఎంట్రీ పట్ల కూడా బాలకృష్ణకు అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఎన్టీఆర్ వారసత్వాన్ని తాను అందిపుచ్చుకుంటూ చంద్రబాబు నాయకత్వాన్ని నిలబెట్టే బాధ్యతను బాలకృష్ణ చేపట్టినట్లు అర్థం చేసుకోవచ్చు. బాలకృష్ణ చురుగ్గా వ్యవహరిస్తున్న స్థితిలో హరికృష్ణకు అవకాశాలు తగ్గవచ్చు. అయితే, ఇప్పటికిప్పుడు హరికృష్ణను పక్కకు తప్పించే ఉద్దేశం కూడా చంద్రబాబుకు లేనట్లు చెబుతున్నారు.
తన నాయకత్వంలో ఉన్నంత కాలం ఉంటారని ఆయన భావిస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు ఒక తాటి మీదికి తెచ్చేందుకు బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈసారి పార్టీని కాపాడుకుని అధికారంలోకి రాకపోతే తీవ్రమైన ప్రమాదం ఉంటుందని, అందువల్ల విభేదాలను పక్కన పెట్టి పనిచేద్దామని ఆయన చెప్పే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.