విజయమ్మకు వణుకు పుట్టే లేఖ రాశారు: బాబు
ప్రభుత్వం మొద్దు నిద్రవల్లనే రుయా ఆస్పత్రిలో శిశు మరణాలు సంభవిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. గత కొద్ది రోజులుగా తిరుపతి రుయా ఆస్పత్రిలో శిశు మరణాలు జరుగుతుండటంతో ఆయన సోమవారం ఉదయం ఆస్పత్రిని సందర్శించారు. ఐసీయూ, చిన్నారుల వార్డులను పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. వరుసగా చిన్నారులు మరణిస్తూ ఉంటే సిబ్బంది ఏం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మెరుగైన చికిత్స అందకనే చిన్నారులు మృతి చెందుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్పత్రి తీరుపై అధికారులపై ఆగ్రహం వ్యక్తపరిచారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి పట్టింపులేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలకు విశ్వాసం కల్పించలేకపోతుందన్నారు. పారామెడికల్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని విమర్శించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు, మంచినీళ్లు లేవని ఆయన అన్నారు.
వైద్యులు, సర్కారు నిర్లక్ష్యం వల్లనే శిశు మరణాలు జరుగుతున్నాయన్నారు. కనీస సౌకర్యాలు లేవని, ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని, జీతాలు లేక సిబ్బంది ఉద్యోగం మానేస్తున్నారన్నారు. రుయాను 300 పడకల ఆసుపత్రిగా నిర్మిస్తే 90 పడకలు మాత్రమే ఉన్నాయని, అందుకు సరిపడా సిబ్బంది కూడా లేదన్నారు. పిల్లల జీవితాలంటే ప్రభుత్వానికి లెక్కలేదని, రాష్ట్రంలో డెంగ్యూ ఫీవర్ లేదని ప్రభుత్వం చెబుతోందని, కానీ రుయాలోనే 30 మంది ఆ రోగంతో బాధపడుతున్నారన్నారు. పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ చోద్యం చూస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
రుయాలో ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి సందర్శించలేదన్నారు. ఇక్కడకు వస్తే వారికి పేషెంట్ల మనోవ్యధ అర్థమవుతుందన్నారు. రుయాలో వెంటనే మంచి నీటి సౌకర్యం కల్పించాలని, ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలని, సరిపడా సిబ్బందిని నియమించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రుయా ఘటనపై హెచ్చార్సీకి ఫిర్యాదు చేస్తానన్నారు. రేపటి నుండి రుయా వద్ద టిడిపి ఆందోళన చేపడుతుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు కొనసాగుతుందన్నారు.