పెన్నా భూములపై సర్కారు వెనక్కి, జగన్ కేసులోనూ..
ఈ మేరకు సదరు కంపెనీకి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. తాండూరు మండలం బెల్కటూరు, సంగెం కలాన్లో సున్నపురాతి నిక్షేపాలున్న 822 ఎకరాల భూములను.. వాటి పట్టాదారులకు కూడా తెలియకుండానే పెన్నా సిమెంట్ కంపెనీకి గతంలో వైయస్ సర్కార్ లీజుకు ఇచ్చిన విషయం తెలిసిందే. 2009 ఫిబ్రవరి 29న జీవో ఎంఎస్ నెం. 76 ద్వారా ఈ భూములను కంపెనీకి ధారాదత్తం చేసింది. ఇందులో 500 ఎకరాలు బడుగులకు చెందిన పట్టాభూములు ఉన్నాయి.
విలువైన ఈ భూములను పెన్నా సంస్థకు అప్పట్లో ఎకరానికి వెయ్యి రూపాయల నామమాత్రపు లీజుకు ప్రభుత్వం ఇచ్చింది. తమ భూములు తమకు తెలియకుండా పెన్నా సంస్థకు కట్టబెట్టారని రైతులు ఆందోళనకు దిగారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. చివరకు ఈ వ్యవహారం జగన్ అక్రమాస్తుల కేసులతో ముడిపడటంతో సిబిఐ కూడా విచారణ మొదలు పెట్టింది. పట్టాదారులకు తెలియకుండా జరిగిన ఈ భూకేటాయింపుపై రచ్చ రచ్చ కావడంతో ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గాలని తాజాగా నిర్ణయించింది.
ఈ మేరకు పట్టాదారుల నుంచి తీసుకున్న సుమారు 500 ఎకరాల భూములను వెనక్కి ఇవ్వాలంటూ పెన్నా సిమెంట్ కంపెనీకి గనుల శాఖ డైరెక్టరేట్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. పట్టాదారుల అనుమతి లేకుండా సేకరించిన భూములను ఎందుకు వెనక్కి ఇవ్వకూడదో తెలపాలని పెన్నా కంపెనీకి నోటీసులు ఇచ్చింది. దీనిపై కంపెనీ నుంచి సమాధానం రాగానే చట్టపరంగా ఈ పట్టా భూములను రైతులకు వెనక్కి అప్పగిస్తారు. రైతుల పట్టా భూములు కాకుండా మిగిలిన భూములపై సర్కారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.