వాయుసేన నమ్మిన బంటు కుప్పకూలింది! ఐదుగురు మృతి

అస్సాంలోని అత్యంత ముఖ్యమైన సైనిక క్షేత్రం 'జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్'లో శనివారం (జూన్ 13, 2026) భారీ ప్రమాదం జరిగింది. భారత వైమానిక దళానికి (IAF) చెందిన ఏఎన్-32 రవాణా విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వే పరిసరాల్లోనే అదుపుతప్పి కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో తీవ్రమైన మంటలు చెలరేగి, నలుమూలలా వ్యాపించాయి. విమాన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు, మరొకరికి తీవ్ర గాయాలైనట్లు జాతీయ మీడియా వెల్లడించింది. మృతుల్లో ఇద్దరు అధికారులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది.

ఈ ప్రమాద వార్త తెలియగానే జోర్హాట్ ఎయిర్‌బేస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాయుసేనకు చెందిన ప్రత్యేక అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి గంటల తరబడి పోరాడి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా వైమానిక దళం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.

వాయుసేన నమ్మిన బంటు.. ఈ ఏఎన్-32!

రక్షణ రంగంలో ఈ ఏఎన్-32 (AN-32) ట్విన్ ఇంజిన్ విమానానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సోవియట్ యూనియన్ కాలంలో తయారైన ఈ విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రవాణా విభాగానికి 'ప్రధాన గుర్రం' (workhorse) లాగా భావిస్తారు. కొండ ప్రాంతాలు, విపరీతమైన వేడి వాతావరణంలో కూడా ఇది సులభంగా దూసుకుపోగలదు. మన దేశంలోని క్లిష్టమైన ఉత్తర సరిహద్దులు, ఈశాన్య రాష్ట్రాల్లోని పర్వత లోయల్లో రక్షణ సామాగ్రిని చేరవేయడానికి వాయుసేన దీన్నే ఎక్కువగా నమ్ముకుంటుంది. ప్రస్తుతం భారత్ వద్ద ఇలాంటివి దాదాపు 100 విమానాలు ఉన్నాయి. ఇది సుమారు 7.5 టన్నుల బరువున్న సరుకును లేదా 50 మంది సైనికులను, అత్యవసర సమయాల్లో దూకే 42 మంది పారాట్రూపర్లను మోసుకెళ్లగలదు. రహదారులు లేని మారుమూల సరిహద్దు గూడేలకు రేషన్, ఆయుధాలు అందించడంలో ఈ విమానాల పాత్ర చాలా కీలకం.

జోర్హాట్ స్థావరానికి ఉన్న 'విషాద చరిత్ర'

అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ బేస్‌కు వైమానిక ప్రమాదాలతో ఒక సుదీర్ఘమైన, బాధాకరమైన చరిత్ర ఉంది. గతంలో 2019 లో కూడా ఇదే తరహా ఏఎన్-32 విమానం ఇక్కడి నుంచే బయలుదేరి ఘోర ప్రమాదానికి గురైంది. జోర్హాట్ నుండి అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుకా రక్షణ కేంద్రానికి వెళ్తుండగా.. గాల్లోకి ఎగిరిన 33 నిమిషాలకే రాడార్ల నుంచి అదృశ్యమయింది. వారం రోజుల పాటు ఆర్మీ జరిపిన గాలింపు తర్వాత అరుణాచల్ ప్రదేశ్‌లోని పారి కొండల్లో 12 వేల అడుగుల ఎత్తులో దాని శకలాలు దొరికాయి. ఆ ప్రమాదంలో విమానంలో ఉన్న 13 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు.

కొన్ని నెలల ముందే కూలిన సుఖోయ్ ఫైటర్ జెట్

తాజా ప్రమాదానికి కొన్ని నెలల ముందే, అంటే 2026 మార్చి 5వ తేదీన అస్సాంలోనే మరో ప్రతిష్టాత్వక యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్థావరం నుంచే నైట్ ట్రైనింగ్ కోసం ఇద్దరు పైలట్లతో బయలుదేరిన 'సుఖోయ్ సూ-30ఎంకేఐ' (Su-30MKI) ఫైటర్ జెట్ కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రతిభావంతులైన వాయుసేన పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.

సరిహద్దు రాష్ట్రమైన అస్సాంలో వాతావరణం చాలా వేగంగా మారిపోతుంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాయుసేన పైలట్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ వరుస ప్రమాదాల వెనుక సాంకేతిక లోపాలు ఉన్నాయా లేక వాతావరణ ప్రతికూలత కారణమా అనే కోణంలో రక్షణ శాఖ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. తాజాగా జరిగిన ఏఎన్-32 ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+