జగన్ చేతిలో మెగా డీఎస్సీ స్కామ్ సాక్ష్యాధారాలు- సీబీఐకి
ఏపీలో మెగా డీఎస్సీ నియామకాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ప్రక్రియ మొత్తం కూడా ముందే రూపకల్పన చేసిన మెగా స్కామ్ గా అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కలిసి మోసపూరితంగా వ్యవహరించారని, ఫలితంగా అర్హత కలిగిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు.
లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమైన డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలు, అవినీతి భారీ స్థాయిలో చోటు చేసుకుందని జగన్ పేర్కొన్నారు. నారా లోకేష్ పర్యవేక్షిస్తోన్న విద్యాశాఖలో భారీ కుంభకోణం జరిగిందని, ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై సీబీఐ విచారణ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 16,000 పోస్టుల నియామకంలో పారదర్శకతను పాతిపెట్టారని, సంస్థాగత పర్యవేక్షణను బలహీనపరిచారని విమర్శించారు.

ఏపీ చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో అవకతవకలు జరిగిన నియామక ప్రక్రియ ఇదేనని జగన్ ఆరోపించారు. ప్రశ్నాపత్రాల తయారీ ఎస్సీఈఆర్టీ చేతిలో, పరీక్ష నిర్వహణ డీఎస్సీ కన్వీనర్ చేతిలో ఉండే పద్ధతిని చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టిందని ధ్వజమెత్తారు. ఈ రెండు కీలక బాధ్యతలను ఒక్క ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కు అప్పగించడంతో గోప్యత, పారదర్శకత రెండూ ప్రమాదంలో పడ్డాయని, అక్కడే మెగా స్కామ్కు బీజం పడిందని ఆరోపించారు.
ప్రశ్నాపత్రాల తయారీ, అప్లోడ్ వంటి అత్యంత గోప్యమైన పనులను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించారని జగన్ విమర్శించారు. అదే వ్యవస్థలో పనిచేసిన ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి డీఎస్సీలో టాప్ ర్యాంకు సాధించడాన్ని ఆయన పేపర్ లీక్కు నేరుగా నిదర్శనంగా అభివర్ణించారు. అతడికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదో, మెరిట్ లిస్టు నుంచి అతడి ఐడీ, డేటా ఎందుకు తీసేశారో, సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదో కూడా ఆయన ప్రశ్నించారు.
ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించడానికి చెప్పిన కారణాలే అసలు అనుమానాలకు బలం ఇస్తున్నాయని జగన్ వ్యాఖ్యానించారు. ఎస్సీఈఆర్టీలో పని చేస్తూ ప్రశ్నపత్రాల తయారీలో భాగమైన వ్యక్తి మొదటి ర్యాంకు సాధించడం పెద్ద అనుమానాలకు దారితీస్తోందని అన్నారు. ఈ పేపర్ లీక్ మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి సీబీఐ విచారణ జరిపించాలని ఆయన అన్నారు. ఫలితాల ప్రకటనలోనూ పూర్తిగా పారదర్శకత లేకపోవడం ఆందోళనకరమని జగన్ చెప్పారు.
గతంలోలాగా కలెక్టరేట్ కార్యాలయాల నోటీసు బోర్డులపై మెరిట్ లిస్టులు, మెరిట్ కమ్ రోస్టర్ లిస్టులు పెట్టలేదని, ఆన్లైన్ డిస్ప్లే, మెసేజింగ్కే పరిమితం చేశారని విమర్శించారు. దీంతో అభ్యర్థులు జిల్లాలవారీగా, కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నిస్సహాయంగా మారారని చెప్పారు. 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు వచ్చినా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినా చివరి ఎంపిక జాబితాలో పేర్లు కనబడలేదని ఆయన అన్నారు.
స్కీల్ ఆఫ్ సెలెక్షన్ రూల్స్ 2025లోని 20వ నిబంధన ప్రకారం మార్కులు, ర్యాంకులు, కట్ ఆఫ్, రిజర్వేషన్లు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కోటా, బెంచ్మార్క్ డిసబిలిటీస్ కోటా అన్నీ పరిగణనలోకి తీసుకుని మెరిట్ కమ్ క్లస్టర్ లిస్టు తయారుచేయాలని ఆయన గుర్తు చేశారు. అదే క్రమంలో స్పోర్ట్స్ కోటా వ్యవహారమే ఈ స్కాంలో అత్యంత స్పష్టంగా కనిపిస్తున్న అంశమని జగన్ ఆరోపించారు. మొదటిసారి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయకుండానే నియామకాల్లోకి తీసుకున్నారని గుర్తు చేశారు.
మొత్తం ఘటనపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసహనంలో ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, నారా లోకేశ్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వంలోనే ఈ స్కాంను రూపొందించారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు కూడా ఇదే వ్యవస్థకు లోబడి ఉన్నందున, వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ వంటి స్వతంత్ర సంస్థ విచారణ అవసరమని ఆయన తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications