నెత్తురోడిన ఔటర్: మాజీమంత్రి కొడుకు మృతి
రింగ్ రోడ్డుపై కారు బోల్తాపడి మాజీ మంత్రి పులి వీరన్న తనయుడు డాక్టర్ ప్రవీణ్ తేజ(38) దుర్మరణం పాలయ్యారు. మంగళవారం రాత్రి 8.30 -9.00 గంటల ప్రాంతంలో రాజీవ్ రహదారి నుంచి కొంపల్లి వైపు వెళ్లేందుకు ఔటర్ రింగ్రోడ్డు సర్వీసు రోడ్డులో తన కారు (ఎపి22క్యూ909)లో అతి వేగంతో వెళ్తుండగా.. షామీర్పేటకు రెండు కిలోమీటర్ల దూరంలో అదుపు తప్పింది. డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. దీంతో తల పగిలి.. ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.
ఈయన ఆర్థోపెడిక్ వైద్యునిగా పనిచేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట పీహెచ్సీలో పనిచేసిన ఆయన.. తర్వాత కొన్నాళ్లపాటు లండన్లో కూడా వైద్యునిగా పనిచేశారు. ఇటీవలే స్వదేశానికి వచ్చి, హైదరాబాద్లో ప్రాక్టీసు చేయడం మొదలుపెట్టారు. ఆయన భార్య విజయ గైనకాలజిస్టు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ప్రమాద సమాచారాన్ని పోలీసులు, మహబూబ్నగర్లోని కుటుంబ సభ్యులకు తెలిపారు. తల్లి, మున్సిపల్ మాజీ చైర్మన్ పులి అంజనమ్మ, చిన్న కుమారుడు శిల్పేష్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
జిల్లాలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన పులి వీరన్న మూడేళ్ల క్రితం చనిపోవడం, ఇప్పుడు కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మహబూబ్నగర్లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కేసును షామీర్పేట ఇన్స్పెక్టర్ కాశిరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.