విరమించండి: కిరణ్, ఐతే మాకు అప్పగించండి.. ఎర్రబెల్లి
టిడిపి కార్యకర్తల ఆందోళన తెలిసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎర్రబెల్లికి ఫోన్ చేసి ధర్నా విరమించాలని విజ్ఞప్తి చేశారు. అయితే విద్యుత్ కోతలు ఉండవని, రైతుల కోసం ఏడు గంటల విద్యుత్ ఇస్తామని తమకు హామీ ఇస్తేనే విరమిస్తామని ఎర్రబెల్లి కిరణ్కు చెప్పారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు ఫోన్ చేసి ఆందోళన విరమించాలని కోరారని, అయితే ఏడు గంటల విద్యుత్ ఇస్తేనే విరమిస్తామని తాము చెప్పామన్నారు.
దీనిపై సిఎంపై ఎలాంటి హామీ రాలేదన్నారు. కలిసేందుకు అనుమతి కోరితే తాను ఢిల్లీ వెళుతున్నానని, వచ్చాక మాట్లాడతానని చెప్పారని, రైతుల ఇక్కడ సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే ఢిల్లీ వెళుతున్న ఇలాంటి చేతకాని ముఖ్యమంత్రి మనకు ఉండటం శోచనీయమన్నారు. పైగా కిటికీలు తెరుచుకోమని, ఎసిలు వేసుకోవద్దని ప్రజలకు ఉచిత సలహాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కళ్లు తెరిచే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు.
తమను పోలీసులు గృహనిర్బంధం చేశారని, కరెంట్ వచ్చి రైతులకు న్యాయం జరిగే వరకు తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కరెంట్ కొరత ఎలా తీర్చాలో సూచిస్తామని, కానీ సిఎం అందుకు ముందుకు రావడం లేదన్నారు. లేదంటే విద్యుత్ శాఖను తమ పార్టీకి అప్పగిస్తే రైతులకు ఏడు గంటల విద్యుత్ ఇచ్చి తీరుతామని సవాల్ చేశారు. ఎర్రబెల్లికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.