పవార్ తిట్లేదే! జోక్గానే: కన్నా, ముఖాన కొట్టు.. ఎర్రబెల్లి
కన్నా లక్ష్మీ నారాయణపై పవార్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు హైదరాబాదులో స్పందించారు. కన్నా పైన, పవార్ పైన ధ్వజమెత్తారు. కాంగ్రెసు మంత్రుల వల్ల ఢిల్లీలో తెలుగువాడి ఆత్మ గౌరవం బజారున పడిందన్నారు. కన్నాకు సిగ్గుంటే వెంటనే రాజీనామా చేసి హైదరాబాదుకు రావాలన్నారు. అఖిలపక్షంతో సహా రైతుల సమస్యలు చెప్పేందుకు వెళ్లినా నిందించిన పవార్ ముఖాన రాజీనామా లేఖను కొట్టాలని కన్నాకు సూచించారు.
అప్పుడే తెలుగువారి ఆత్మగౌరవం ఇనుమడిస్తుందన్నారు. లేదంటే వెన్నెముక లేని కాంగ్రెసు నేతల వల్ల తెలుగువారు ఇంకా ఇంకా ఇలా చేదు అనుభవం ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెసు నేతల వల్లనే తెలుగు జాతికి పలుమార్లు అనుమానం జరుగుతోందన్నారు. కన్నా బృందాన్ని అవమానించినందుకు పవార్ తెలుగు ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా మంత్రి కన్నా లక్ష్మీ నారాయణకు ఢిల్లీలో చేదు అనుభవం ఎదురయిన విషయం తెలిసిందే. శరద్ పవార్ మంత్రి కన్నా పైన గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదే పదే ఎందుకు వస్తున్నారంటూ చిందులు తొక్కారు. రాష్ట్రంలోని వ్యవసాయ సమస్యలపై అఖిల పక్షంతో కలిసి కన్నా కేంద్రమంత్రి పవార్ను కలిసేందుకు వెళ్లారు. అక్కడకు వచ్చిన పవార్ కన్నాను చూసి ఒక్కసారిగా రెచ్చిపోయారు. మంత్రి మారినప్పుడల్లా ఇలా వచ్చి ఎందుకు దాడి చేస్తున్నారని మండిపడ్డారు.
చెప్పాల్సింది ఒకసారి చెబితే సరిపోతుందని, రైతుల సమస్యలు తమకు తెలుసునని, ఎన్నిసార్లు కలుస్తారని, పదే పదే రావాల్సిన అవసరం లేదంటూ క్లాస్ పీకారు. ప్రతిసారి వచ్చి ఇంత హడావుడి చేయడం అవసరమా అని ప్రశ్నించారు. వేలాపాలా లేకుండా వచ్చేస్తున్నారంటూ ఆక్రోషం వ్యక్తం చేశారు. మీ ప్రవర్తన యుద్దానికి వచ్చినట్లుగా ఉందని చిందులు తొక్కారు. మంత్రి మారినప్పుడల్లా అఖిలపక్షంతో రావడం సరికాదన్నారు.