కిరణ్ సహా ముగ్గురు ముఖ్యమంత్రులకు ఎసరు?
ఇప్పటికే మన రాష్ట్ర కేబినెట్ మొత్తం దాదాపు ఢిల్లీలో వాలిపోయింది. ముఖ్యనేతల మార్పులపై అధినేత్రి పైన, ఢిల్లీ పెద్దల పైన ఒత్తిడి తెస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో సహా పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను మార్చాలని అధిష్టానానికి ఫిర్యాదులు పెద్ద మొత్తంలో అందుతున్నాయి. కొణిజేటి రోశయ్య తర్వాత సిఎం బాధ్యతలు చేపట్టిన కిరణ్ పరిస్థితిని చక్కదిద్దుతాడనుకుంటే పార్టీ పెద్దలు ఆశించిన స్థాయిలో కాకపోయినా కనీస మార్కులు కూడా అధిష్టానం నుండి కొట్టేయలేక పోయారని చెబుతున్నారు.
అదే సమయంలో జగన్ కోవర్టని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీని పట్టించుకోవడం లేదని, సొంత అజెండాతో వెళుతున్నాడని.. మంత్రులు, నాయకులు ఢిల్లీ పెద్దల వద్ద కిరణ్ పైన ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే యోచనపై అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తున్నదని చెబుతున్నారు. అయితే కాంగ్రెసు అధికారంలో ఉంటే తరుచూ ముఖ్యమంత్రులను మారుస్తుందనే అపవాదు గురించే ఇప్పుడు ఢిల్లీ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు. ఆ అపవాదు లేకుంటే ఏమాత్రం తొణకకుండా తక్షణమే నిర్ణయం తీసుకునే వారని, ఆ అపవాదును పరిగణలోకి తీసుకొని కిరణ్ను తొలగించడంపై జోరుగా చర్చ జరుగుతోందని అంటున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహన్, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ను కూడా ఆ బాధ్యతల నుండి తప్పించాలని సోనియా భావిస్తున్నారని అంటున్నారు. షీలాను సిఎంగా తప్పిస్తే ఆమెను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మహారాష్ట్రలో అశోక్ చవాన్ తర్వాత బాధ్యతలు చేపట్టిన పృథ్వీరాజ్ చౌహాన్ పైన కూడా అధిష్టానం అసంతృప్తతో ఉన్నారని అంటున్నారు.
కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం సోనియా గాంధీతో సమావేశమయ్యారు. కిరణ్తో సోనియా సమావేశంలో అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి పాల్గొన్నారు. వీరి మధ్య ధర్మాన ప్రసాద రావు వ్యవహారం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై కూడా వారు చర్చించారని తెలుస్తోంది. కిరణ్ సోనియాతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు.