ప్రభుత్వానికి ఎదురుదెబ్బ: అయినా దినేష్ రెడ్డికే చాన్స్
గతంలో డీజీపీ దినేష్రెడ్డి నియామకం చెల్లదని, ఆయన నియామకం సీనియారిటీ ప్రాతిపదికన జరుగలేదని క్యాట్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా క్యాట్ తీర్పును సమర్థిస్తూ తీర్పు చెప్పడంతో ప్రభుత్వం మళ్లీ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దీనిపై విచారించిన సుప్రీం ధర్మాసనం పై మేరకు తీర్పునిచ్చింది. దినేష్ రెడ్డి 1977 బ్యాచ్కు చెందినవారు
దినేష్ రెడ్డి ఎంపిక చెల్లదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ మళ్లీ సీనియారిటీ ప్రకారం తిరిగి ఆయనకే అవకాశం లభించనుంది. దినేష్ రెడ్డి కన్నా సీనియర్లయిన గౌతం కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. శివశంకర్ జులైలోనే పదవీ విరమణ చేయడంతో సీనియారిటీ చిక్కుముడి వీడింది. అదే బ్యాచ్కు చెందిన ఉమేష్ కుమార్ ఫోర్జరీ కేసులో క్రిమినల్ కేసును ఎదుర్కుంటూ సస్పెండ్ అయ్యారు. దీంతో యుపిఎస్సికి పంపే జాబితాలో ఆయన పేరును చేర్చే అవకాశం లేదు.
అదే సమయంలో 1979 బ్యాచ్కు చెందిన టిపి దాస్, అరుణా బహుగుణ, బి ప్రసాదరావు, ఎస్ఎ హుడా డైరెక్టర్ జనరల్ స్థాయిలో ఉన్నారు. వారిలో ఇద్దరి పేర్లు కూడా జాబితాలో ఉండే అవకాశం ఉంది. రెండేళ్ల సీనియర్ అయిన దినేష్ రెడ్డిని కాదని 1979 బ్యాచ్ అధికార్ల పేర్లను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ముగ్గురు డిజి స్థాయి అధికారుల పేర్లను ప్యానల్గా రూపొందిస్తుంది. ఆ పేర్లను యుపిఎస్సికి పంపిస్తుంది.