మైలురాయి, ఓట్ల కోసం కాదు: సబ్ ప్లాన్పై సిఎం
ఇక నుంచి ఎస్సీ, ఎస్టీ నిధుల్లో కోత ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఓ కొత్త అధ్యాయమని, ఎస్సీ, ఎస్టీలకు సేవ చేసేది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. ఎస్టీ, ఎస్సీ నిధులను ఇంతకు ముందు సరిగా ఖర్చు చేయని మాట నిజమేనని ఆయన అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు ఈ ఏడాదే చట్టబద్దత కల్పిస్తామని, ఇందుకు ప్రత్యేకంగా శానససభా సమావేశాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
క్షేత్రస్థాయిలో పనులు జరగాలంటే నిఘా తప్పనిసరి అని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, సబ్ ప్లాన్ వల్ల వారికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. నందన్ నీలేకని కూడా రాష్ట్ర పాలనను ప్రశంసించారని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధుల్లో 2 వేల కోట్లు మిగులు ఉందని ఆయన చెప్పారు. నోడల్ ఏజెన్సీని పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. సబ్ ప్లాన్ అమలుకు ప్రత్యేక అధికారాలున్న వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బడ్జెట్లో ఎస్టీలకు 6.6 శాతం, ఎస్సీలకు 16.2 శాతం నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్పై రాష్ట్ర ప్రభుత్వానికి కేబినేట్ సబ్ కమిటీ నివేదికను అందజేసింది. శనివారం ఉదయం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన సబ్ కమిటీ నేతలు సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయి నివేదికను అందజేశారు. ఉప ప్రణాళికపై కమిటీ వేయాలని నివేదికలో సూచించింది. పూర్తి స్థాయి నివేదికను సమర్పించేందుకు గడువుకావాలని సబ్ కమిటీ కోరినట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల వినియోగంపై అధ్యయనానికి ఉప ముఖ్యమంత్రి దామోదర నర్సింహ నేతృత్వంలో సబ్కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని దామోదర రాజనర్సింహ మీడియా ప్రతినిధులతో అన్నారు. నివేదిక కోసం రాష్ట్రవ్యాప్తంగా అనేక వర్క్ షాపులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ సమస్యలు తెలుసుకుని నివేదిక రూపొందించినట్లు ఆయన తెలిపారు. దళితులకు, గిరిజనులకు సమానత్వం కల్పించే విధంగా నివేదిక రూపొందించినట్లు ఆయన తెలిపారు.