మంత్రివర్గ భేటీకి ధర్మాన దూరం, చర్చకు చాన్స్
రెండు నెలల తర్వాత సమావేశమైన మంత్రి వర్గ సమావేశంలో ధర్మాన ప్రసాద రావు రాజీనామాపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇలా చర్చ జరిగే సమయంలో మంత్రివర్గం సమావేశంలో ఉండకపోవడం మంచిదని కొంత మంది ధర్మానకు సూచించినట్లు సమాచారం. మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామా లేఖ పెండింగులోనే ఉంటుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చెప్పారు. వివరణ ఇవ్వడానికి ధర్మానకు సిబిఐ 40 రోజుల సమయం ఇచ్చిందని ఆయన చెప్పారు. దీన్నిబట్టి 40 రోజుల పాటు కూడా ధర్మాన రాజీనామాను పెండింగులోనే ఉంచే అవకాశం ఉంది.
కాగా, కరెంట్ కోతలపై, ఫీజు రీయంబర్స్మెంట్పై మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే, వస్త్రవ్యాపారులపై విధించిన వ్యాట్పై కూడా చర్చ జరగవచ్చునని అంటున్నారు. కొత్త భూకేటాయింపుల విధానాన్ని మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశానికి నిర్మీత సమయానికి 25 మంది మంత్రులు వచ్చారు.
ప్రతిపక్షాల ఆందోళన, తదితర అంశాలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్కు మంత్రి వర్గ ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. మంత్రి వర్గ ఆమోదం తర్వాత దానికి చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు చేపడతారు. అందుకు ప్రత్యేకంగా శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.