మంత్రివర్గ భేటీ: పవర్ పరిస్థితిపై మంత్రుల ఆగ్రహం
ఫీజు రీయంబర్స్మెంట్పై ప్రభుత్వ ఉన్నతాధికారి రేమండ్ పీటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రుల సందేహాలకు ముఖ్యమంత్రి సమాధానాలు ఇచ్చారు. ఫీజు రీయంబర్స్మెంట్కు ఉపకార వేతనాలకు సంబంధం లేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఉపకారవేతనాలను ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. కర్నూలులో ఎసిబి కోర్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నూతన భూకేటాయింపు విధానాన్ని మంత్రి వర్గం ఆమోదించింది.
సహకార పంచదార కర్మాగారాలకు 180 కోట్ల రూపాయలు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. ప్రకాశం జిల్లాలోని కందుకూరు వద్ద పవర్ గ్రిడ్ కార్పొరేషన్కు 60 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలోని మీర్ఖాన్ పేటలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్కు 30 ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ వద్ద బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకు 2 ఎకరాలు కేటాయిస్తూ మంత్రి వర్గం నిర్ణయం చేసింది. కరీంనగర్ జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి ఏడెకరాలు కేటాయిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది.
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మధ్య కుదిరిన ఒప్పందానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్త ఉద్యోగాల ఖాళీల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంతకు ముందు ప్రకటించిన 12 వేల 864 కొత్త పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో 7 వేల 180 టీచర్ పోస్టులు కాగా, 44 డాక్టర్ పోస్టులు, 44 ఇంజనీరింగ్ పోస్టులు, 120 పారామెడికల్ పోస్టులు, 73 గెజిటెడ్ పోస్టులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని గోపనపల్లిలో బయోటెక్ కాలేజీకి వంద ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.