జగన్ పార్టీ ఎమ్మెల్యే వీరంగం: తూగోలో కేసు నమోదు
తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెంలో ప్రగతి స్కూల్, శ్రీరామ్ చిట్స్ పైన వైయస్సార్ కాంగ్రెసు దౌర్జన్యం చేసింది. అక్కడ ఉన్న స్కూల్ బస్సు అద్దాలు, చిట్ ఫండ్ కార్యాలయ అద్దాలు పగిలిపోయాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కడప జిల్లా పులివెందులలోనూ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. బస్టాండు వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు రాస్తా రోకో నిర్వహించారు.
పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పులివెందులలోనే ధర్నాలో పాల్గొన్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో పిన్నెల్లి లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిని నిరసిస్తూ కార్యకర్తలు బైఠాయించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు.