సిఎంతో భేటీ: రాజీనామాపై పట్టు వీడిన ఎస్పీవై రెడ్డి
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను ఆపకపోతే తాను రాజీనామా చేయడం ఖాయమని ఆయన అంతకు ముందు అన్నారు. ఐదు వేల క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తే అభ్యంతరం లేదు గానీ ఒకేసారి 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం అన్యాయమని ఆయన అన్నారు.
శ్రీశైలం నుంచి పెద్ద యెత్తున నీటిని విడుదల చేస్తే కర్నూలు జిల్లా సాగునీటికి, మంచినీటికి ఎద్దడి ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ సమస్యపై జిల్లా మంత్రులు ఏరాసు ప్రతాప రెడ్డి, టిజి వెంకటేష్ కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వివరించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కిందికి నీటిని విడుదల చేస్తే తమకు తిప్పలు తప్పవని వారన్నారు.
ఇదిలా వుంటే, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుదుత్పత్తిని ప్రభుత్వం తగ్గించింది. ఈ నెల 3వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట నిర్వహించనున్నారు. ఈ సమయంలో శ్రీశైలం నీటి సమస్య ఎదురు కావడం ఆయనకు ఇబ్బందిగానే ఉంది. ఇందిరమ్మ బాటలో సమస్యలు తలెత్తకుండా శ్రీశైలం నీటి విడుదల సమస్యను పరిష్కరించే యోచనలో ఆయన ఉన్నారు.
శ్రీశైలం నీటి విడుదలను నిరసిస్తూ తాను పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఎస్పీవై రెడ్డి శుక్రవారం ఢిల్లీలో ప్రకటించారు. ప్రభుత్వం తీరుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన చెబుతున్నారు. డెల్టాకు నీటి విడుదలను డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కోస్తా జిల్లాల నాయకులు ఆందోళన చేపట్టడంతో ముఖ్యమంత్రికి శ్రీశైలం నీటి విడుదల ఇబ్బందిగానే పరిణమించింది.
మరోవైపు, నాగార్జునసాగర్ నుంచి కిందికి నీటిని విడుదల చేయకూడదని కాంగ్రెసు నల్లగొండ జిల్లా పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం లేఖ రాశారు. నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేస్తే తప్ప కృష్ణా డెల్టాకు సాగు నీరు అందదు.