రోడ్లపై టిడిపి నేతలు, కార్యకర్తలు: దేవినేని ఉమ అరెస్టు
తెలుగుదేశం శానససభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు సహా పార్టీ కార్యకర్తలను, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల డెల్టా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాగార్జునసాగర్ నుంచి నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డెల్టా పరిరక్షణ పేర గతంలో ఆందోళనలు చేసిన కాంగ్రెసు నాయకులు ఇప్పుడేమయ్యారని ఆయన అడిగారు.
గుంటూరు జిల్లా పెద్దకాకాని వద్ద తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రహదారిపై ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు పెట్టారు. దాంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఈ సమయంలో పోలీసులకు, తెలుగుదేశం నాయకులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. పోలీసులు, తెలుగుదేశం నాయకులను అరెస్టు చేసి పెదకాకాని పోలీసు స్టేషన్కు తరలించారు.
డెల్టా కింది 13 లక్షల ఎకరాల పంటలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు సాగు నీటి కోసం తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అరెస్టు చేస్తున్నారని తెలుగుదేశం గుంటూరు జిల్లా నాయకుడు కోడెల శివప్రసాద రావు మండిపడ్డారు. తమ ఉద్యమాన్ని అపేది లేదని ఆయన చెప్పారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయడం తగదని రాయలసీమ నాయకులు చేస్తున్న వాదనను దేవినేని ఉమా మహేశ్వర రావు తప్పు పట్టారు. కృష్ణా జిల్లా కాంగ్రెసు నాయకుల చేతగాని తనం వల్లనే రాయలసీమ నాయకులు ఆ విధమైన వాదనను ముందుకు తెస్తున్నారని ఆయన అన్నారు.