భార్యను ఎన్నారై భర్త అరెస్టు, కట్నం వేధింపులు
వివరాల్లోకి వెళ్తే - విశాఖపట్నానికి చెందిన రామారావు, సుజాతలు తమ కూతురు సంతోషి సుజన (24)ను సికింద్రాబాదులోని సీతాఫల్మండికి చెందిన సంతోష్ రాజ్కు ఇచ్చి 2008లో వివాహం జరిపించారు. పెళ్లి సందర్భంగా 15 లక్షల రూపాయల నగదు, 30 తులాల బంగారం, మరో లక్ష రూపాయల విలువ చేసే గృహోపకరణాలు కట్నంగా ఇచ్చారు. అయితే కొంత కాలానికే మరో ఐదు లక్షలు తీసుకురావాలని సంతోష్ రాజ్ భార్యను వేధించడం ప్రారంభించాడు.
ఆ స్థితిలోనే అతను 2009లో ఒంటరిగా అమెరికా వెళ్లిపోయాడు. కొద్ది కాలానికి సంతోషి సుజన కూడా అమెరికా వెళ్లింది. వీరిద్దరు తిరిగి నగరానికి వచ్చారు. అయినా అతను వేధింపులు మానలేదు. 2011లో భార్యాభర్తలు అస్ట్రేలియా వెళ్లారు. అక్కడ కూడా సంతోషిని అదనపు కట్నం కోసం వేధించసాగాడు. అడిగిన డబ్బు తీసుకుని రాలేదని ఆమెను ఆస్ట్రేలియాలోనే వదిలేసి ఇక్కడికి వచ్చేశాడు.
స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాధితురాలు అక్కడి నుంచి తల్లిదండ్రులను సంప్రదించి ఆగస్టు 12వ తేదీన నగరానికి వచ్చింది. అత్తింటివారి వద్దకు వెళ్లగా భర్తతో పాటు అత్త ఇంట్లోకి రావద్దంటూ ఆమెకు చెందిన వస్తువులను బయటకు విసిరేశారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు బేగంపేట మహిళా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.