రాయపాటి వైరాగ్యం: కాంగ్రెసుపై సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుత రాజకీయాలకు తాను పనికి రానని, త్వరలో రాజకీయ సన్యాసం గురించి వెల్లడిస్తానని ఆయన చెప్పారు. 2014 వరకు ప్రభుత్వాన్ని లాగించడానికి కాంగ్రెసు పెద్దలు ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆయన అన్నారు. పార్లమెంటు సమావేశాలకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆయన చెప్పారు. కాంగ్రెసు పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని, ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చునని ఆయన అన్నారు.
రాయపాటి సాంబశివ రావు చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలు చేసినా గుర్తింపు లభించడం లేదనే ఆవేదన ఆయనను వెంటాడుతూ ఉంది. కాంగ్రెసులో ఓ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవిని ఆశించి భంగపడినట్లు సమాచారం.
కాగా, గుంటూరు జిల్లాలో కూడా ఆయనకు అనుకూలమైన పరిస్థితులు లేవని చెబుతారు. మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఆధిపత్యం వల్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇరువురికి మధ్య బహిరంగ వాగ్యుద్ధం చెలరేగిన సందర్భాలు కూడా ఉన్నాయి. పార్టీ పెద్దలు కన్నా లక్ష్మినారాయణను ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలు కూడా ఆయనకు ఉన్నట్లు చెబుతారు.