బాబుకు వాసిరెడ్డి కౌంటర్: వైయస్కు శంకరన్న కితాబు
చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఏనాడు పేదల గురించి ఆలోచించలేదన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్సుపై ఇప్పుడు ధర్నా చేస్తున్న బాబు ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. రీయింబర్సుమెంట్సు పథకం వైయస్ రాజశేఖర రెడ్డి కల అన్నారు. అందుకే అధికారంలోకి వచ్చాక దానిని అమలు పర్చారని, బాబుకు మాటల్లో ఉన్న ఆందోళన చేతల్లో ఉండదని ఎద్దేవా వాసిరెడ్డి పద్మ చేశారు.
విద్యుత్ సంక్షోభంపై మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గదేనని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఘనత దివంగత వైయస్దేనని మాజీ మంత్రి శంకర రావు వేరుగా అన్నారు. ఆరోగ్యశ్రీ పథకంతో రాష్ట్రంలో కోట్లాది మందికి మేలు జరిగిందన్నారు.
జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో ప్రభుత్వం పట్టింపులకు పోరాదని, వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని శంకర రావు సూచించారు. పేదల ఆరోగ్యం దృష్ట్యా జూనియర్ డాక్టర్లు కూడా సమ్మెను విరమించుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ భయపడవలసిన అవసరం లేదన్నారు. పార్టీ గుర్తు లేకుండా మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని, గెలిచిన వారిని పార్టీలోకి తీసుకోవచ్చునని అన్నారు.