ఢిల్లీలో బాబు బిజీ: కాంగ్రెసు తెలంగాణ ఎంపిల భేటీ

అంతకు ముందు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్తో చంద్రబాబు బృందం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కరువు సమస్యలు, రైతుల పరిస్థితిని ఆయనకు వివరించారు. అయితే కరవు పరిస్థితిపై తమకు రాష్ట్రం నుంచి ఎలాంటి నివేదిక అందలేదని పవార్ చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. ఇది చాలా బాధాకరమన్నారు. పార్లమెంటులో బీసీ డిక్లరేషన్పై చర్చలకు మద్దతు తెలపడానికి పవార్ సుముఖంగా ఉన్నట్లు చంద్ర బాబు తెలిపారు.
మరోవైపు బాబుతో తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు భేటీ అయ్యారు. తెలంగాణపై అనుకూలంగా లేఖ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేతలు బాబును కోరారు. తాము మర్యాదపూర్వకంగానే బాబును కలిసినట్లు భేటీ అనంతరం ఎంపీలు తెలిపారు. ఎంపీలు గుత్తాసుఖేందర్, బలరాంనాయక్ , కోమటిరెడ్డి బాబును కలిసిన వారిలో ఉన్నారు.
ఎన్నికలకు 9 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు మీడియా ప్రతినిధులతో అన్నారు. వంద మంది బీసీ అభ్యర్థులను తాము ప్రకటిస్తామని ఆయన అన్నారు. చరిత్ర చూస్తే ఏ పార్టీ బీసీలకు న్యాయం జరిగిందో తెలిసిపోతుందని, కాంగ్రెసు పార్టీ అన్యాయం చేసిందని ఆయన అన్నారు. బీసిలకు సామాజిక న్యాయం జరగడం లేదని ఆయన అన్నారు. బీసి డిక్లరేషన్ జాతీయ ఎజెండా కావాలన్నది తమ ఉద్దేశమని ఆయన అన్నారు.
ఆర్థిక సంస్కరణల పలితాలు అన్ని వర్గాలకు అందడం లేదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి చెందిన బీసీలకు అవకాశం ఇవ్వలేదని ఆయన విమర్సించారు. బడ్జెట్లో ఒబిసీలకు 25 శాతం నిధుల కేటాయించాలని ఆయన అన్నారు. బీసీ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు నెలల గడువు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఈలోగా స్పందించకపోతే జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణపై త్వరలోనే స్పష్టం ఇస్తానని ఆయన చెప్పారు. తెలంగాణపై రాజకీయం ఎక్కువ చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అవసరం లేదని బిజెపి నేత అద్వానీ గతంలో అన్నారని ఆయన గుర్తు చేశారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఒక్కసారైనా తెలంగాణపై చర్చించారా అని ఆయన అడిగారు. గత ఎన్నికల్లో పొత్తుల వల్లనే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వలేకపోయామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications