విజయమ్మ దీక్షపై సారయ్య ఫైర్, జగన్ పార్టీ కౌంటర్
కాంగ్రెస్ లేకుంటే వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి రాజకీయ జీవితం లేదని వ్యాఖ్యానించారు. విజయమ్మ చెట్టు పేరు చెప్పుకుని కాయలను అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టడమే కాదు..వాటిని అమలు చేయడం కూడా ముఖ్యమేనని, వైయస్ హయాంలో పేరుకుపోయిన ఫీజు బకాయిలను సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెల్లించారని మంత్రి సారయ్య తెలిపారు.
తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేస్తున్న దీక్షపై విమర్శలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎదురు దాడి ప్రారంభించింది. వైయస్ విజయమ్మ పాపులారిటీ కోసం దీక్ష చేస్తున్నారంటూ కాంగ్రెసు నాయకులు చేస్తున్న విమర్శలను పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు తిప్పికొట్టారు. వైయస్ హయాంలో శాచ్యురేషన్ పద్ధతిలో విద్యార్థులకు అభయమిస్తే ఈ ప్రభుత్వం నిబంధనల పేరుతో భయపెడుతోందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ప్రజలకు మేలు చేయాలనే తపన కాంగ్రెసు ప్రభుత్వానికి లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. చేసిన తప్పులను సరిదిద్దుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని ఆమె అన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం భారంగా పరిగణిస్తోందని ఆమె విమర్శించారు. ఫీజు రీయంబర్స్మెంట్పై ఆంక్షలు ఎత్తేసి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.