రిచ్చెస్ట్ మంత్రి అళగిరి, 76 శాతం పెరిగిన శుక్లా ఆస్తి
న్యూఢిల్లీ: కేంద్రమంత్రుల ఆస్తుల లెక్కను ప్రధానమంత్రి కార్యాలయం గురువారం విడుదల చేసింది. కేంద్ర మంత్రులందరిలోకి అత్యంత ధనవంతుడిగా డిఎంకెకు చెందిన ఎంకె అళగిరి నిలిచారు. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఈయనకు, ఈయన భార్య కాంతికి కలిపి ఉన్న ఆస్తి విలువ రూ. 37 కోట్లు. అళగిరికి రూ. 35 లక్షల విలువైన రేంజ్ రోవర్తో పాటు మరో హోండా సిటీ కారు ఉంది. ఆయన భార్యకు రూ. 75 లక్షల విలువైన బీఎండబ్ల్యు కారు ఉంది.
2011తో పోలిస్తే వీరిద్దరి ఆస్తుల విలువ 17శాతం పెరిగింది. అయితే, ఆస్తుల విలువను గణనీయంగా పెంచుకున్న విషయంలో మాత్రం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రాజీవ్ శుక్లానే అగ్రస్థానంలో ఉన్నారు. ఓ వార్తాచానల్ అధినేత్రి అయన తన భార్యతో కలిపి ఈయన ఆస్తుల విలువ ఏడాదిలో ఏకంగా 76శాతం పెరిగింది. ఈ జంటకు గత సంవత్సరం రూ. 16.56 కోట్ల ఆస్తులుండగా, ఈసారి అది రూ. 29.25 కోట్లు అయ్యింది.
కేవలం ఆయన భార్యకే రూ. 23.24 కోట్ల ఆస్తి ఉంది. శుక్లా సొంత ఆస్తి 2011లో 1.8 కోట్లుండగా 2012లో 5.9కోట్లు అయ్యింది. కానీ ఈ కుటుంబం మొత్తానికి కలిపి 2003 నాటి హ్యుండాయ్ ఎసెంట్ కారు ఒక్కటే ఉంది. ఇక వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ కుటుంబానికి అస్సలు వాహనమే లేదట. గత సంవత్సరం కంటే ఈ కుటుంబ ఆస్తులు 33 శాతం పెరిగి రూ. 16 కోట్లకు చేరాయి.
బ్యాంకులలో రూ. 2.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, ఢిల్లీలోని ద్వారకా సెక్టార్లో సొంత ఫ్లాటు ఉన్నాయి. ఆర్థి కమంత్రి చిదంబరం, ఆయన భార్యకు కలిపి ఆస్తులు 26% పెరిగి రూ. 30 కోట్లకు చేరుకున్నాయి. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబ ఆస్తులు రూ. 14.18 కోట్లు. ఆయన పెట్టుబడులు చాలావరకు ఫ్లాట్లమీదే ఉన్నాయి. పుణెలో రూ. 2.14 కోట్లు, బాంద్రాలో రూ. 1.98 కోట్ల విలువైన ఫ్లాట్లున్నా, ఒక్క కారూ లేదట.
2003 నాటి మిత్సుబిషి ట్రాక్టర్ ఒక్కటే ఉందని, దాని విలువ రూ. 1.89 లక్షలని ఆయన తెలిపారు. గతంలో భారీ మొత్తంలో ఆస్తులున్న కమల్నాథ్ (రూ. 260 కోట్లు), ప్రఫుల్పటేల్ (రూ. 101 కోట్లు) మాత్రం ఈసారి తమ ఆస్తులను ఇంకా వెల్లడించలేదు. అలాగే ప్రధాని మన్మోహన్సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ కూడా 2012 నాటి లె క్కలను బయటపెట్టలేదు.