ప్రధాని: మోడీకి చెక్ చెప్పేందుకు జాతీయస్థాయిలో....
2014 సాధారణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎన్డీయేలోని ప్రధాని అభ్యర్థిత్వంపై జోరుగా చర్చ జరుగుతోంది. గుజరాత్ను ఉన్నత స్థానంలో నిలిపిన మోడీ వైపు అందరూ మొదట చూశారు. ఆ తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు తెర పైకి వచ్చింది. తాజాగా శివసేన అధినేత బాల్ థాకరే.. సుష్మా స్వరాజ్ పేరు కొత్తగా తెరపైకి తీసుకు వచ్చారు. ఇదంతా మోడీ చరిష్మాను తగ్గించేందుకే అనే వాదనలు వినిపిస్తున్నాయి.
గుజరాత్లో తిరుగులేని నేతగా ఎదిగిన మోడీకి ఇంటి సమస్యలు అక్కడ చాలా ఉన్నాయి. అయితే ప్రజల్లో మాత్రం ఆయనకు మంచి పేరు ఉంది. దీంతో అతనిని ఎదుర్కొనేందుకు పార్టీలోని ప్రత్యర్థులతో పాటు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇక రాష్ట్రంలోనే ఇంతగా ఎదిగిన నేత జాతీయస్థాయి రాజకీయాల్లోకి వస్తే తమ పొలిటికల్ కేరీర్కు ఫుల్ స్టాప్ పడుతుందని చాలామంది నేతలు భావిస్తున్నారని, అందుకే మోడీని జాతీయ రాజకీయాల్లోకి రాకుండా చేసేందుకు ఇటు బిజెపిలోని ప్రత్యర్థులతో పాటు కాంగ్రెసు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
మోడీ పేరు ప్రధానిగా తెర పైకి రాగానే నితీష్ ఆయన అభ్యర్థిత్వంపై విముఖత వ్యక్తం చేశారు. మోడీని పిఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తాము ఎన్డీయే నుండి వైదొలగుతామని హెచ్చరించారు. ఆ తర్వాత అద్వానీ తన బ్లాగ్లో 2014లో ప్రధానిగా కాంగ్రెసు, బిజెపియేతర నేత అవుతారని చెప్పారు. ఇప్పుడు బాల్ థాకరే కొత్తగా సుష్మ పేరును తెర పైకి తీసుకు వచ్చారు. ఇదంతా మోడీ ఎదుగుదలను అడ్డుకునేందుకే అంటున్నారు.
మోడీని ఎదుర్కొనేందుకు గోద్రా, తదనంతర సంఘటనను ప్రత్యర్థులు ప్రయోగిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెసు మోడీని టార్గెట్గా చేసుకోవడానికి తొలి నుండి దీనినే ఉపయోగిస్తుంది. ఇప్పుడు సొంత కూటమిలోని ప్రత్యర్థులు కూడా దీనిని ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు. మోడీ పైన గోద్రా ముద్ర ఉన్నప్పటికీ ఆ తర్వాత రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేశారు. అంతేకాదు మిగిలిన రాష్ట్రాలలో కంటే గుజరాత్లోని ముస్లింల జీవన శైలి బాగుంది. ఇది మోడీ లౌకికత్వానికి నిదర్శనమంటున్నారు. అయితే ఆయన ప్రత్యర్థులు మాత్రం హిందుత్వ ముద్ర వేసి, మతవాదిగా ఆయనను చిత్రీకరించి జాతీయస్థాయిలో ఎదగకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.