జెడి కాల్లిస్ట్: వేధించొద్దు.. సిఐడికి హైకోర్టు అక్షింతలు
అదే సమయంలో సిఐడికి మొట్టికాయలు వేసింది. ఏ కేసులోనైనా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించే అధికారం దర్యాఫ్తు సంస్థలకు ఉందని, అయితే వారిని వేధించవద్దని సూచించింది. నిందితులను మానసిక వేధనకు గురి చేయవద్దని సిఐడికి హితవు పలికింది. బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్న సిఐడి పిటిషన్ను కొట్టి వేసింది. కాగా జెడి లక్ష్మీ నారాయణ కాల్లిస్టు లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు రఘురామకృష్ణరాజుకు సెషన్స్ కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిలు రద్దు చేయాలని సిఐడి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
జెడి లక్ష్మీ నారాయణను నైతికంగా దెబ్బతీసేందుకు రఘురామరాజు మరికొందరితో కుట్రపన్ని అక్రమంగా జెడి కాల్ లిస్టును సేకరించారని కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ కేసులో రఘురామరాజు పాత్రను వివరిస్తూ, అయన బెయిల్ను రద్దు చేయాలని సిఐడి ఎస్పీ రామకృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ముఖీద్ పోలీసు స్టేషన్లో తప్పుడు ఫిర్యాదుచేసి సిబిఐ జెడి కాల్డేటాను రఘురామరాజు తన అనుచరుల ద్వారా సేకరించారని, దాని ఆధారంగా మీడియాలోని ఓ వర్గానికి దర్యాప్తు వివరాలను జెడి లీక్ చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు గుర్తు చేశారు.
జగన్ మీడియా ద్వారా కాల్ లిస్టులోని వివరాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రచారం చేశారని తెలిపారు. సిబిఐ జెడిఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసులో నిందితుడు కె.వి. రెడ్డిని విచారిస్తే కుట్ర బయట పడిందని పిటిషన్లో సిఐడి పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రఘురాజు కుటుంబంతో సహా సింగపూర్కు పారిపోయారని, ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని వివరించారు.
విచారణకు సహకరిస్తానంటూ సెషన్స్ కోర్టును తప్పుదోవపట్టించి తన న్యాయవాది ద్వారా ముందస్తు బెయిలు పొందారని, అనంతరం లుక్ అవుట్ నోటీసులు ఉపసంహరించేలా ఆదేశాలు తెచ్చుకున్నారని తెలిపింది. సింగపూర్ పారిపోయిన విషయాన్ని కోర్టుకు తెలపలేదని, మొదటి నుంచి ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయనకు కింది కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని ఆభ్యర్థించింది. దీనిని కోర్టు నేడు తిరస్కరించింది.