లగడపాటి కాగితప్పులి, తొండలాగే..: కోదండరామ్

వేళ్లు తెగిపోయిన చెట్టులా సీమాంధ్ర పాలకులున్నారని, లగడపాటి పైకి కనిపించేలా పులికాదని, కాగితం పులి అని, సగం చచ్చినవాడిని పట్టించుకోవద్దని అన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో 'ఉద్యమ సదస్సు' జరిగింది. ఇందులో కోదండరాం ప్రారంభోపన్యాసం చేశారు. ప్రభుత్వాన్ని దెబ్బకొట్టడానికే 30న తెలంగాణ మార్చ్ జరగనుందని, గాంధీ దండియాత్రలా ఈ పోరాటం జరుగుతుందని చెప్పారు. భవిష్యత్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి స్పష్టమైన కార్యాచరణ నిర్ణయించుకుంటామని వెల్లడించారు.
తెలంగాణ నుంచి లగడపాటి లాంటివాళ్లను తరిమికొట్టడానికి పోరాడాలని టీఎన్జీవోల సంఘం పూర్వ అధ్యక్షుడు స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ మార్చ్ బ్లూప్రింట్ సిద్ధమవుతోందని, జాతరకు పోయినట్లు సద్దికట్టుకొని రావాలని సూచించారు. తెలంగాణ మార్చ్కు ఉద్యోగులంతా బంధువులను, మిత్రులను వెంట తీసుకొని వస్తారని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ చెప్పారు. మానుకోటలా తెలంగాణ మార్చ్ చేపడతామని న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వెంకటేశ్వరరావు అన్నారు.
ఆ తర్వాత సిద్దిపేటలో జరిగిన సకల జనుల సమ్మె స్ఫూర్తి సభలో కూడా కోదండరామ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో రాజకీయ ప్రక్రియ చేయాల్సింది పార్టీలేనని చెప్పారు. కేసీఆర్ ఢిల్లీలో చర్చలు జరపడం వల్ల వందశాతం తెలంగాణ వస్తుందన్న నమ్మకం తనకున్నదని స్వామిగౌడ్ చెప్పారు. కేంద్రం మోసంచేస్తే సమరం తప్పదని హెచ్చరించారు.
కాగా, తెలంగాణలోని ఇంటిదొంగలే కేసీఆర్ నిబద్ధత, నిజాయితీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. జీవితాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధన కోసం ఆయన కృషి చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ను శంకించే వారిని ఇంటి దొంగలుగా, తెలంగాణ ద్రోహులుగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications