దమ్ముందా: చంద్రబాబుకు వైయస్ విజయమ్మ సవాల్
ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు లేదని ఆమె అన్నారు. ప్రస్తుత అసమర్థ పాలనపై దమ్ముంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అవిశ్వాసం ఎందుకు పెట్టరని ఆమె ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ఉట్టికెక్కాయన్నారు. రాష్ట్ర చరిత్రలో రూపాయి పన్ను పెంచకుండా పరిపాలన చేసి రికార్డు సృష్టించిన ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఒక్కరేనని అన్నారు.
ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు తాపత్రయపడుతోందని ఆమె దుమ్మెత్తిపోశారు. తన భర్త రాజశేఖరరెడ్డి అనుమానాస్పద మృతి అనంతరం లేనిపోని అవినీతి ఆరోపణలు చేసి అన్యాయంగా జగన్ను అరెస్టు చేసి జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో వైయస్ పాదయాత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి తన కుటుంబాన్ని ఆహ్వానించకపోవడం బాధాకరమన్నారు. నూతన పాలసీలతో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ధ్వజమెత్తారు.
కొందరు మంత్రులు సైతం రాజశేఖరరెడ్డిని విమర్శించడం బాధాకరమన్నారు. రాజశేఖరరెడ్డి స్వర్ణయుగాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ఆ స్వర్ణయుగం మళ్ళీ జగన్ హయాంలోనే సాధ్యమన్నారు. జిల్లా ముఖ్య నేతలు డా. కుక్కల నాగేశ్వరరావు, కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు(నాని), ఉప్పులేటి కల్పన, వాకా వాసుదేవరావు విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.