కోదండ వెనుక టిఆర్ఎస్, చూద్దాం: జగ్గారెడ్డి X హరీష్

కెసిఆర్, కోదండరామ్ వంటి వారి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస నేతలు అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. మెజార్టీ లేనప్పుడు తీర్మానం పెడితే వచ్చే తెలంగాణ రాకుండా పోతుందన్నారు. శ్రీధర్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోదండరామ్ పైన, తెరాస పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వేరు, మంత్రి పదవి వేరు అని, ప్రజాప్రతినిధులకు ఏమైనా అయితే రెచ్చగొట్టే వారిదే బాధ్యత అన్నారు.
కోదండరామ్, తెరాస పైన కేసులు నమోద చేయాలన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలపై సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. తమపై కేసులు పెడితే ఏమవుతుందో వారే చూస్తారని, అయినా కేసులకు తాము భయపడే ప్రసక్తి లేదన్నారు. కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకేం చేతకాదన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గాంధీ భవనంలో కాంగ్రెసు పార్టీ జరిపితే, అధికారంలో ఉన్న అదే పార్టీ అధికారికంగా మాత్రం జరపక పోవడం విడ్డూరమన్నారు. తెలంగాణ మార్చ్తో యుద్ధభేరీ మోగిస్తామన్నారు. విద్యుత్ సమస్యపై తాము విద్యుత్ సౌధను ముట్టడిస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు తాము ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల ద్వారా ప్రయత్నిస్తామని జూపల్లి కృష్ణా రావు అన్నారు. సమైక్య రాష్ట్రం ఏర్పడకముందు నిజాం పాలనలో ఉన్న తమ రాష్ట్ర జిల్లాల్లో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తే ఇక్కడ మాత్రం అలా జరగడం లేదని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు, టిడిపి రెండు పార్టీలు ఒకటేనని నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణపై తీర్మానం పేరుతో చర్చలు జరగకుండా టిఆర్ఎస్ అడ్డుపడుతోందని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు మండిపడ్డారు. అసెంబ్లీలో తెలంగాణ కోసం తీర్మానం పెడితే మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ ఆ పేరుతో సభా సమయాన్ని వృధా చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై ఈ నెలలోనే కేంద్రానికి లేఖ రాస్తామన్నారు.
కాగా అసెంబ్లీ రెండోసారి వాయిదా పడిన అనంతరం ప్రారంభమైంది. అయితే తెరాస నేతలు తీర్మానం కోసం పట్టుబట్టాయి. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. సభను అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications