పాదయాత్రతో బాబు, ఎడ్లబండిపై విజయమ్మ: వాయిదా
కాగా అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రతో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఎడ్ల బండిపై అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్రంలో నెలకొన్ని విద్యుత్ సమస్యలను నిరసిస్తూ అసెంబ్లీ వరకు చంద్రబాబుతో సహా టిడిపి ప్రజాప్రతినిధులు పాదయాత్ర చేపట్టారు. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుండి అసెంబ్లీ వరకు వారు పాదయాత్ర చేపట్టారు.
గ్యాస్ సిలిండర్ల పరిమితి, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైయస్ విజయమ్మ ఆధ్వర్యంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఎడ్లబండిపై, సైకిల్ రిక్షాలపై సమావేశాలకు హాజరై వినూత్నంగా నిరసన తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి సైకిల్ రిక్షాల మీద సభకు వచ్చారు. వైయస్ విజయమ్మ ఎడ్ల బండిపై అసెంబ్లీకి చేరుకుని తమ నిరసనను తెలియజేశారు.
కాగా సభను వాయిదా వేసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలతో పాటు పలువురు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వంపై టిడిపి నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని, అధికార పార్టీ సభ్యులు సగం మంది సభలో లేరని, తొలుత విద్యుత్ సమస్యపై చర్చించాలని, ఆ తర్వాతే ఇతర సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు.