అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు: తెలంగాణపై జవదేకర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో బిల్లు ప్రతిపాదించాలి గానీ చేతగాని మాటలు చెప్పవద్దని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సలహా ఇచ్చారు. తెలంగాణపై ముఖ్యమంత్రి శానససభలో చేసిన వ్యాఖ్యలు సహించరానివని ఆయన మంగళవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. తక్షణం ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి గ్యాస్ తెచ్చుకోలేని ముఖ్యమంత్రికి ఎఫ్డిఐలను ఆమోదించడానికి సిగ్గు లేదా అని ఆయన అడిగారు. వృద్ధులకు పింఛన్ల కోసం గాంధీ జయంతి రోజు ధర్నా చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్పై పెట్టే కేసులు కాంగ్రెసుకు సమాధి కడతాయని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు స్పష్టమైన వైఖరి తెలుపందే తాము అఖిల పక్ష సమావేశానికి వెళ్లబోమని ఆయన చెప్పారు.
తెలంగాణపై కేంద్రం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో శాసనసభలో తీర్మానం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పట్టుబట్టడం సరి కాదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. సిఎల్పీ కార్యాలయంలో ఆనయ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సభలో ఏ విధమైన చర్చ జరగకుండా వాయిదా పడటం బాధాకరమని ఆయన అన్నారు.
ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం శానససభలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆనయ అన్నారు. సభ సజావుగా నడిచేందుకు ప్రతిపక్షాలు సహకరించాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రం ఈ నెలాఖరు లోపే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ మార్చ్కు తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సంఘీభావం తెలపడం వారి వ్యక్తిగత విషయమని ఆయన అన్నారు. మార్చ్కు కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు మద్దతు ఇవ్వాలా, వద్దా అనే విషయంపై సమావేశమై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.