మే నెలలో భారత్ లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నగరాలు
అమెరికాకు చెందిన నేషనల్ ఓషానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మే ప్రపంచవ్యాప్తంగా రెండో అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా చరిత్రలో నిలిచింది. 1850 నుండి సేకరించిన వాతావరణ గణాంకాలను విశ్లేషించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చింది. మే నెలలో ప్రపంచ సగటు ఉపరితల ఉష్ణోగ్రత 15.79 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.
2024 తర్వాత మే నెలలో ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది రెండోసారి. ఇది ప్రపంచవ్యాప్తంగా వేడెక్కుతున్న వాతావరణ ధోరణికి అద్దం పట్టింది. యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (C3S) ప్రకారం రోజువారీ సగటుతో పోలిస్తే ఇది 1.4 డిగ్రీలు అధికం. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా మే నెలలో రెండో అత్యధిక స్థాయిని తాకాయి.

పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు ఉష్ణోగ్రతలను మరింత పెంచాయి. దీనికి తోడు హీట్ డోమ్స్, అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్స్, దశాబ్దాలుగా కొనసాగుతున్న వాతావరణ మార్పుల కారణంగా ఈ మే నెల ఎండలు భరించలేని స్థాయిలో నమోదయ్యాయి. ఈ అంతర్జాతీయ వాతావరణ ప్రభావం భారత్లో తీవ్రంగా కనిపించింది. జూన్ 4న రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో, దేశవ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పుల ధాటి పెరిగింది.
భారత్ లో రాజస్థాన్ ఈ వేడికి ప్రధాన కేంద్రంగా మారింది. మే 27న శ్రీగంగనగర్లో 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, చురులో 48 డిగ్రీల మార్కును దాటేసింది. చండీగఢ్, లూధియానా, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటిపోయాయి. భవిష్యత్తులో ఇటువంటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, ఇది ప్రజా ఆరోగ్యం, వ్యవసాయ రంగం, మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అహ్మదాబాద్ లో హీట్ ఎక్స్పోజర్ స్కోరు 0.89గా నమోదైంది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఎండ తీవ్రత అధికంగా ఉన్న నగరాల్లో నాగ్పూర్ ది రెండో స్థానం. 0.86 హీట్ ఎక్స్పోజర్ స్కోర్ రికార్డయిందిక్కడ. 0.75 రిస్క్ స్కోర్ తో భోపాల్ మూడో స్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానం మధురైది. హో చి మిన్ సిటీ తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యధిక హీట్ ఎక్స్పోజర్ స్కోరు మధురైలో నమోదైంది.
ఉష్ణోగ్రతతో పాటు గాలిలో తేమ శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఢిల్లీ, ముంబై, చెన్నై కంటే మధురైలోనే వేడి పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. పాట్నాలో కూడా హీట్ రిస్క్ ఫ్యాక్టర్ అత్యధికం. చిన్న పిల్లలు, వృద్ధులు, అల్పాదాయ వర్గాల ప్రజలు ఎండల వల్ల ఎక్కువ ముప్పును ఎదుర్కొంటున్నారు. తక్కువ గ్రీనరీ ఉండటం వల్ల ఇక్కడ వేడి ప్రభావం ప్రజా ఆరోగ్యానికి పెద్ద సమస్యగా మారింది.
హీట్ రిస్క్ ఫ్యాక్టర్ అధికంగా ఉన్న నగరాల్లో జైపూర్ ఒకటి. అలాగే.. ఉద్యాననగరిగా పేరున్న బెంగళూరు కూడా ఈ జాబితాలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక్కడ హీట్ ఎక్స్ పోజర్ రిస్క్ స్కోర్ 0.69. ఆహ్లాదకరమైన వాతావరణానికి పేరుగాంచిన బెంగళూరు ఈ జాబితాలో ఉండటం ఆశ్చర్యకరం. గ్రీనరీ తగ్గిపోవడం, వేడిని తట్టుకునే సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో ఇది ప్రమాదకర నగరాల జాబితాలోకి చేరింది.
హైదరాబాద్, ముంబై, చెన్నైలదీ ఇదే పరిస్థితి. హైదరాబాద్ లో రిస్క్ స్కోరు 0.76. నగరంలో కాంక్రీట్ నిర్మాణాలు పెరగడం, వేడిని తట్టుకునే వ్యవస్థల అంచనాలకు తగినట్టుగా లేకపోవడం వల్ల భవిష్యత్తులో ఎండ తీవ్రత మరింత పెరగొచ్చు. తీర ప్రాంత నగరం కావడంతో చెన్నైలో తేమ, ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇతర నగరాలతో పోలిస్తే, ఇక్కడి ప్రజలకు ఎండకు తట్టుకునే వనరులు కొంత మెరుగ్గా ఉన్నాయని అధ్యయనం చెబుతోంది.













Click it and Unblock the Notifications