ఆర్టీసి ఛార్జీల పెంపు: అర్ధరాత్రి నుండే, ఖండించిన బాబు
డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కి.మీ.కు 10 పైసలు, సూపర్ లగ్జరీ బస్సుల్లో కి.మీ.కు 12 పైసలు పెంచింది. సిటీ బస్సుల్లో ఇప్పటి వరకు కనీస ఛార్జ్ రూ.4 ఉండగా ఇప్పుడు రూ.5కు పెంచారు. రెండు స్టేజీల వరకు ఇది పెరిగింది. తాజాగా పెంచిన ఛార్జీలు ఈ రోజు అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తాయి. ఇప్పుడు పెంచిన ఛార్జీలను బట్టి హైదరాబాద్ నుండి ప్రధాన నగరాలైన విజయవాడకు రూ.262, విశాఖకు రూ.625, తిరుపతికి 565, వరంగల్కు రూ.137గా సూపర్ లగ్జరీ ఛార్జీలు ఉండనున్నాయి.
విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల్లో పెంపును సడలించారు. గరుడ, గరుడ ప్లస్, ఇంద్ర, వెన్నెలస్సుల ఛార్జీలు యథాతథంగా ఉంటాయి. అయితే రద్దీని బట్టి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. డీజిల్ ధరల పెంపుతో ఆర్టీసి పైన రూ.834 కోట్ల భారం పడిందని, కానీ తాము మాత్రం ప్రజలపై నామమాత్రం భారం మోపుతున్నామని ఆర్టీసి ప్రకటించింది. కాగా బస్సు ఛార్జీల పెంపుపై విపక్షాలు మండిపడ్డాయి. ఆర్టీసి ఛార్జీల పెంపు సామాన్యుని నడ్డి విరిచే చర్య అని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
డీజిల్ ధరల పెంపు పేరుతో ఆర్టీసీ ఛార్జీల పెంపు సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఛార్జీల పెంపుపై ఉద్యమిస్తామన్నారు. ఛార్జీల పెంపును నిరసిస్తూ సోమవారం రాష్ట్రంలోన్ని అన్ని బస్సు డిపోల వద్ద ఆందోళన చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. ఛార్జీల పెంపు బాధ్యతారాహిత్యమని సిపిఎం నేత వీరయ్య అన్నారు.