జగన్, బిజెపి: న్యూఢిల్లీలో తెలంగాణ కోసం కెసిఆర్ పట్టు

YS Jagan-K Chandrasekhar Rao
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దాదాపు గత ఇరవై రోజులుగా న్యూఢిల్లీలో ఉంటూ తెలంగాణ కోసం కాంగ్రెసు పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీల భయంతోనే ఢిల్లీలో ఉంటూ ఎన్నడూ లేని విధంగా తెలంగాణ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

పలువురు ఢిల్లీ పెద్దలను కలుస్తున్న కెసిఆర్ వారి వద్ద కూడా అదే బూచీని ప్రస్తావిస్తున్నారట. ఇటీవల తెలంగాణ ఉద్యమం కొత్త పుంతలు తొక్కిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్లుగా టిఆర్ఎస్ తెలంగాణ సాధన పేటెంట్‌గా ఉండిపోయింది. తెలంగాణ అంటే కెసిఆర్ - కెసిఆర్ అంటే తెలంగాణ అన్న విధంగా మారిపోయింది. అయితే ఇటీవల ఉద్యమం తీవ్రమవుతున్న దృష్ట్య పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఇటీవలి వరకు సమైక్య గళం వినిపించిన సిపిఐ ఇప్పుడు తెలంగాణ అంటూ కొత్త రాగం అందుకుంది. మరోవైపు బిజెపి తెలంగాణకు తొలి నుండి అనుకూలంగా ఉన్నప్పటికీ ఉద్యమ బాట పట్టింది చాలా తక్కువ. కానీ ఇటీవల ఆ పార్టీ తెలంగాణ కోసం జోరుగా ఉద్యమిస్తోంది. మిగతా పార్టీల కంటే ఉద్యమాలలో అదే ముందుంటోంది. ఈ పార్టీల రంగ ప్రవేశంతో తెలంగాణ పేటెంట్ కెసిఆర్ చేతుల నుండి జారీపోయిందనే వార్తలు కూడా వినిపించాయి.

పాలమూరు ఉప ఎన్నికలలో బిజెపి గెలుపొంది తెరాసకు సవాల్ విసిరింది. పరకాల ఉప ఎన్నికలలో డిపాజిట్ కోల్పోయినప్పటికీ ఓట్లు చీల్చడంతో అక్కడ టిఆర్ఎస్ చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచింది. తెలంగాణవాదం వినిపిస్తున్న సిపిఐ కూడా క్రమంగా ఆ ప్రాంతంలో పుంజుకుంటోంది. అదే సమయంలో జగన్ పార్టీ పరకాలలో కెసిఆర్ పార్టీకి ముచ్చెమటలు పోయించింది. ఇన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్‌తో టిఆర్ఎస్ ఒక్కటే లబ్ధి పొందింది.

తెలంగాణ వాదంపై తెరాసకు మరో రెండు పార్టీలు జత కలవడం, జగన్ పార్టీ చాపకింద నీరులా బలోపేతం అవుతుండటం, అంతేకాకుండా ఇన్నాళ్లు అదిగో తెలంగాణ ఇదిగో తెలంగాణ అని కెసిఆర్ చెబుతూ వస్తుండటం.. దానిపై ప్రజల్లో క్రమంగా ఆగ్రహం పెల్లుబుకుతుండటం.. ఈ పరిణామాలన్నీ కెసిఆర్‌ను పునరాలోచనలో పడేశాయని, అందుకే ఆయన ఎన్నడూ లేని విధంగా తెలంగాణ కోసం ఢిల్లీలో కుటుంబం సభ్యులతో సహా మకాం వేశారని అంటున్నారు. కాంగ్రెసు పెద్దలను కలుస్తున్న కెసిఆర్... వారికి కూడా జగన్, బిజెపి బూచీ చూపిస్తున్నారట!

రాష్ట్రంలో బిజెపి అంత సీన్ లేని పార్టీ అని, కానీ తెలంగాణ ఉద్యమం కారణంగా అది క్రమంగా బలపడుతోందని ఆయన వారి దృష్టికి తీసుకు వెళ్తున్నారట. మరోవైపు సీమాంధ్రలో జగన్ ప్రభావం ఎక్కువగా ఉందని, అయితే అక్కడ సమైక్యాంధ్ర సెంటిమెంట్ అంతగా లేదని, తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న దృష్ట్యా ప్రత్యేక రాష్ట్రం ప్రకటిస్తే.. తెలంగాణలో కాంగ్రెసు అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని, తద్వారా సీమాంధ్రలో జరిగే నష్టాన్ని కొద్దిగానైనా పూడ్చేందుకు అవకాశముంటుందని, తెలంగాణ ప్రకటించని పక్షంలో అక్కడ జగన్, ఇక్కడ తెలంగాణ ప్రభావంతో కాంగ్రెసు భారీ ఓటమి చవి చూడాల్సి ఉంటుందని కెసిఆర్ చెబుతున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+