విలీనంపై చర్చలు, ఎప్పుడైనా మధ్యంతరం: చంద్రబాబు
మహబూబ్ నగర్ ఎంపి కెసిఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను కూడా విలీనం చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెసుతో ఇప్పటి వరకు రాజీపడనిది కేవలం టిడిపియేనని, ఎన్ని ఆటుపోటులు వచ్చినప్పటికీ తట్టుకొని నిలబడగలిగిందన్నారు. కొందరు తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.
కేంద్రం తెలంగాణపై రోజుకో విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర విభజన అంశంపై ఇరు ప్రాంతాల నేతలతో చర్చిస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలో ఇప్పటి వరకు వచ్చిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు అన్ని తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే అధికారంలోకి వచ్చాయన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన పాదయాత్రపై అధికారిక ప్రకటన చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన అనంతపురం జిల్లా హిందూపురం నుండి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
అక్టోబర్ 2 నుండి పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన రోజు కంటే మంచి రోజు మరొకటి లేదన్నారు. అందుకే ఆ రోజు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. జన చైతన్యం, వస్తున్నా మీకోసం అనే రెండు పేర్లను పాదయాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు చెప్పారు.